'మందగమనంలోను దూసుకెళ్తోంది, జగన్-కేసీఆర్ ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండానే..!'
హైదరాబాద్/అమరావతి: ప్రపంచంతో పాటు భారతదేశంలోను ఆర్థిక మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ, రిటైల్ వ్యాపారంపై దాని ప్రభావం అంతగా లేదని వాల్మార్ట్ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో క్రిష్ అయ్యర్ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాదులోని వాల్మార్ట్ ఇండియా, హెచ్డీఎఫ్సీ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
వ్యాపారులకు బెస్ట్ ఆఫర్: రివార్డులు, క్యాష్ బ్యాక్లు
కర్నూలు, తిరుపతిలలో బెస్ట్ ప్రైస్ స్టోర్
తమ బెస్ట్ ప్రైస్ విక్రయ కేంద్రాలను మరిన్ని పెంచడం ద్వారా వ్యాపారాన్ని మరింతగా విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు క్రిష్ అయ్యర్ తెలిపారు. పదేళ్ల క్రితం తొలి స్టోర్ను ప్రారంభించిన వాల్ మార్ట్ బెస్ట్ ప్రైస్ ఈ రోజు 27 స్టోర్లు నిర్వహిస్తోంది. గత 13 నెలల్లో వివిధ పట్టణాల్లో 7 కొత్త స్టోర్లు ప్రారంభించింది. దేశంలో 50 బెస్ట్ ప్రైస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో వచ్చే వారం స్టోర్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోను బెస్ట్ ప్రైస్ స్టోర్ రానుంది.
జగన్-కేసీఆర్ ప్రభుత్వాల నుంచి అవసరమైన లైసెన్స్లు వెంటనే...
క్రిష్ అయ్యర్ మాట్లాడుతూ.. దేశీయ రిటైల్ వ్యాపారం 2027 వరకు 1.2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని చెప్పారు. ఇతర రంగాల పరిస్థితి గురించి తమకు తెలియదని, కానీ కస్టమర్లు తమ వద్దకు కొనేందుకు వస్తున్నారని, కేంద్రం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తమకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కేసీఆర్, జగన్ ప్రభుత్వాల నుంచి అవసరమైన లైసెన్స్ వంటివి ఎలాంటి ఇబ్బంది లేకుండా పొందుతున్నామన్నారు.
ఫ్లిప్కార్ట్ స్వతంత్రమే..
ఆర్థిక మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ రిటైల్ రంగం అంచనాలకు మించి వృద్ధిని నమోదు చేసుకుంటోందని తెలిపారు. ప్రపంచ మార్కెట్లో భారత్ అన్ని విభాగాల్లో దూసుకుపోతోందన్నారు. కాగా, ఫ్లిప్కార్టులో వాల్మార్ట్ పెట్టుబడులు పెట్టినప్పటికీ అది పూర్తి స్వతంత్రంగానే కొనసాగుతుందని క్రిష్ తెలిపారు. ఫ్లిప్కార్ట్ బృందమే దానిని నిర్వహిస్తోందన్నారు.
వాల్ మార్ట్ మరిన్ని పెట్టుబడులు
2022 నాటికి మరిన్ని స్టోర్స్ కోసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది వాల్ మార్ట్. యూరోమానిటర్ రిపోర్ట్ ప్రకారం ఏసియాలోని టాప్ 100 రిటైలర్స్లో వాల్మార్ట్ ఇండియా నెంబర్ వన్ స్థానంలో ఉంది. ఫ్లిప్కార్ట్ అక్వైజేషన్ అనంతరం ఇది సాధ్యమైంది.