Vizag Housing: విశాఖలో విపరీతంగా పెరిగిన ఇళ్ల ధరలు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఎస్బీఐ..
Real Estate: ఎస్బీఐ రీసెర్చ్ రియల్ ఎస్టేట్ ధరల విషయంలో సెన్సేషనల్ విషయాలను వెల్లడించింది. రెసిడెన్షియల్ హౌసింగ్లో ఎమర్జింగ్ ట్రెండ్లపై ప్రత్యేక నివేదికను రూపొందించింది. మెట్రో నగరాలతో పోలిస్తే చిన్న పట్టణాలు, నగరాల్లో ఇళ్ల ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపింది.
విశాఖ నగరంలో..
రియల్ ఎస్టేట్ ధరలు భారీగా పెరిగిన నగరాల జాబితాలో.. విశాఖపట్నం, గౌహతి, రాయ్పూర్, సూరత్, వడోదర, జైపూర్, లక్నో, డెహ్రాడూన్ వంటి టైర్-2 నగరాలు ఉండగా.. కోయంబత్తూర్, గ్రేటర్ నోయిడా వంటి టైర్-3 నగరాలు కూడా ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేయటం, ఈ మధ్య కాలంలో వైజాగ్ రియల్ ఎస్టేట్ పై అనేక ప్రాంతాల ప్రజలు మక్కువ చూపటం కూడా ఈ ధరల పెరుగుదల వెనుక కారణంగా తెలుస్తోంది.
కారణం ఇదేనంటున్న ఎస్బీఐ..
వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్రీలాన్స్ జాబ్స్ వంటి కారణాల వల్ల చిన్న నగరాలు, పట్టణాల్లో ఇళ్లకు డిమాండ్ పెరిగిందని ఎస్బీఐ నివేదికలో వెల్లడించింది. పట్టణ జనాభా, రాజధానులు వంటి అనేక అంశాలను ఇందులో పరిగణలోకి తీసుకున్నారు.
ఈ మార్పుకు కారణమేమిటి?
ఈ మార్పు వెనుక కొవిడ్ మహమ్మారి ఉందా అని చూసినట్లయితే.. కొవిడ్ మన జీవితాలను అనేక విధాలుగా మార్చింది. మహమ్మారి ఫలితంగా వచ్చిన అలాంటి ట్రెండ్లో ఒకటి ఇంటి నుంచి పని చేయడం పెరిగింది. 2019లో కరోనా మొదటి వేవ్ సమయంలో దాదాపు అన్ని కంపెనీలు వర్క్-ఫ్రమ్-హోమ్ విధానాన్ని అమలు చేశాయి. ప్రస్తుతం కంపెనీలు పాండమిక్ తరువాత హైబ్రిడ్ మోడల్ కు మారాయి. ఇది కూడా ఇళ్ల మార్కెట్ కు డిమాండ్ పెరిగేందుకు కారణంగా నిలుస్తోంది.
మెట్రోలకు దూరంగా..
పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు, తక్కువ జీవన వ్యయం ఇప్పటికే చాలా మంది ప్రజలు రద్దీగా ఉండే మెట్రోపాలిటన్ నగరాలకు దూరంగా నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ కారణంగా చిన్న నగరాలు, నగర శివారు ప్రాంతాల్లో గృహాల ధరలు గణనీయంగా పెరిగాయి. అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలు అంతర్జాతీయ నాణ్యత గల జీవనశైలి నివాస ప్రాజెక్టులను ప్రారంభించాయి. ప్రభుత్వం చేపట్టిన అమృత్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు కూడా రియల్ ఎస్టేట్ బూమ్ కు కారణంగా నిలిచాయి.