ఫెవిపిరవిర్ తయారీకి ఓకే, హైదరాబాద్ కంపెనీ షేర్లు భారీగా జంప్
హైదరాబాద్కు చెందిన వివిమెడ్ ల్యాబ్స్ స్టాక్స్ నేడు భారీగా ఎగిశాయి. ఏకంగా 5 శాతం లాభపడి రూ.28.35 వద్ద క్లోజ్ అయింది. ఇందుకు ప్రధాన కారణం ఫెవిపిరవిర్ తయారీ, మార్కెటింగ్కు వివిమెడ్కు DGHI అనుమతిచ్చింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాక్సీన్ లేదా ఇతర సంబంధిత మెడిసిన్స్ తయారీ ఫార్మా కంపెనీల స్టాక్స్ అంతకంతకూ పెరుగుతున్నాయి.
కరోనా చికిత్సలో వినియోగించే యాంటీ వైరల్ ఔషధం ఫెవిపిరవిర్ తయారీకి ఈ హైదరాబాద్కు చెందిన ఫార్మా కంపెనీకి అనుమతి లభించడం గమనార్హం. ఈ టాబ్లెట్లను 200MG, 400MG రూపంలో తయారు చేయడానికి DGHI నుండి అనుమతులు వచ్చినట్లు వివిమెడ్ కంపెనీ రెగ్యూలేటరీ ఫైలింగ్లో వెల్లడించింది. ఈ ఔషధాన్ని కరోనాలో తేలికపాటి నుండి మధ్యస్థాయి లక్షణాలు ఉన్న రోగుల చికిత్సకు వినియోగిస్తున్నారు. దీనిని ఫావులౌస్ పేరుతో విక్రయించనుంది వివిమెడ్.
దేశవ్యాప్తంగా నోటి ద్వారా తీసుకొనే యాంటీవైరల్ ఔషధంగా దీనిని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడంతో డాక్టర్లకు చాలా ఆప్షన్లు అవసరమని, ఈ నేపథ్యంలో తాము తయారు చేసిన ఫావులౌస్ టాబ్లెట్లను మార్కెట్లో అందుబాటు ధరల్లో తీసుకొస్తామని సీఈవో రమేష్ కృష్ణమూర్తి అన్నారు. ఇది రోగులకు ఆరోగ్యం అందీయడంతోపాటు, వారిపై ఆర్థిక భారాన్ని కచ్చితంగా తగ్గిస్తుందన్నారు.