విదేశీ కేసులకు కూడా వివాద్ సే విశ్వాస్, ఏ కేసులు వస్తాయంటే?
పన్ను చెల్లింపుదారులు, పన్ను స్వీకరణదారులకు మధ్య వివాదాల పరిష్కారం కోసం ప్రకటించిన వివాద్ సే విశ్వాస్ పథకం పరిధిలోకి విదేశాల్లోని కేసులను కూడా వర్తిస్తాయని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఆదాయపు పన్ను వివాదాల పరిష్కారానికి ఈ పథకం సువర్ణ అవకాశమని ఆదివారం తెలిపింది.
కొత్త ఆదాయపు పన్ను విధానం: మీ సేవింగ్స్పై ప్రభావం... కానీ
వివాద్ సే విశ్వాస్ స్కీం
విదేశాల్లో నడుస్తున్న ఆదాయపు పన్ను కేసులను వివాద్ సే విశ్వాస్ పథకం కింద చేపట్టేందుకు అర్హత ఉంటుందని ఐటీ విభాగం స్పష్టం చేసింది. తద్వారా పన్ను చెల్లింపుదారులు, పన్ను స్వీకర్తల మధ్య వివాదాలు పరిష్కారమవుతాయని తెలిపింది.
ఇవన్నీ ఈ స్కీం పరిధిలోకి...
అర్హత, వివాదాల కవరేజీ, చెల్లింపు నిబంధనలను అందులో పేర్కొన్నారు. దీని కిందకు పన్ను, అపరాధ రుసుము, వడ్డీ ఫీజు, మూలం వద్ద పన్ను మినహాయింపు (TDS) లేదా మూలం వద్ద పన్ను వసూలు (TCS) వంటి అన్ని వివాదాలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. ఈ పథకం నోటిఫై చేయాల్సి ఉంది.
జనవరి 31వ తేదీలోపు దాఖలైన పిటిషన్లు, రిట్స్
జనవరి 31 లేదా అంతకంటే ముందు దాఖలైన పిటిషన్లు, రిట్లు ఈ పథకానికి అర్హమైనవని ఐటీ శాఖ తెలిపింది. ప్రతి ఏడాది పెండింగులోని పన్ను వివాదాలు భారీగా పెరిగిపోతుండగా వీటి వల్ల రూ.వేలకోట్ల ఆదాయం ప్రభుత్వానికి రావడం లేదు. అలాగే పన్ను చెల్లింపుదారులు నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో వివాద్ సే విశ్వాస్కు మోడీ సర్కార్ సిద్ధపడింది.
రూ.5 కోట్లకు దిగువన..
ప్రభుత్వం లేదా పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన కేసులన్ని కూడా ఈ స్కీంలోకి వస్తాయి. కమిషనర్ (అప్పీల్స్), డీఆర్పీ, ఐటీ అప్పీలెట్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీం కోర్టుల్లోని కేసులతోపాటు సీఐటీ ముందు పెండింగులో ఉన్న రివిజన్ కేసులను పరిష్కరించుకునే వీలుంది. రూ.5 కోట్లకు దిగువన ఉన్న సెర్చ్ కేసులకు ఈ పథకం వర్తిస్తుంది. అయితే ఇందుకు డిక్లరెంట్ తమ డిక్లరేషన్ను సంబంధిత అథారిటీ ముందు దాఖలు చేయాలి.