Vistara: రికార్డు సృష్టించిన విస్తారా ఎయిర్ వేస్.. కంపెనీ పెట్టాక తొలిసారిగా..
Vistara: టాటాలకు చెందిన ఎయిర్ వేస్ సంస్థ విస్తారా అని మనలో చాలా మందికి తెలుసు. ఇది టాటా సన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ జాయింట్ వెంచర్. వాణిజ్య కార్యకలాపాలను కంపెనీ 9 జనవరి 2015న ప్రారంభించింది. తొలుత దిల్లీ నుంచి ముంబైకి మెుదటి విమానాన్ని నడపటంతో విస్తారా తన గగనతల ప్రయాణాన్ని మెుదలు పెట్టింది.
కంపెనీ ప్రకటన..
విస్తారా తన వ్యాపార ప్రస్తానాన్ని భారతదేశంలో ప్రారంభించిన తర్వాత ఈ రోజు అతిపెద్ద ప్రకటన చేసింది. DGCA గణాంకాల ప్రకారం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో విస్తారా 33.06 లక్షల మంది ప్రయాణికులతో 9.2 శాతం మార్కెట్ వాటాను సంపాదించింది. అలా కంపెనీ తన బిలియన్ డాలర్ల ఆదాయ మార్కును అధిగమించింది. దీంతో కంపెనీ తన ప్రస్థానం మెుదలెట్టిన తర్వాత డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో లాభాలను ఆర్జించింది.
విస్తారా సీఈవో..
గణనీయమైన నెట్వర్క్, ఫ్లీట్ విస్తరణతో పాటు గత కొన్ని నెలలుగా స్థిరమైన వృద్ధితో సంస్థ ముందుకు సాగుతోందని సీఈవో వినోద్ కన్నన్ తెలిపారు. ఆర్థిక పనితీరు పరంగా 2022 విస్తారాకు అద్భుతమైన సంవత్సరమని ఆయన తెలిపారు. విస్తారా తన అంతర్జాతీయ నెట్వర్క్ను 2022లో 180 శాతానికి పైగా పెంచుకుంది. కొత్త అంతర్జాతీయ, దేశీయ రూట్లలో సేవలను విస్తరించి నెట్వర్క్ను మరింతగా పెంచుకుంది.
లాభం ఎంతంటే..?
తొలిసారి లాభాలను నమోదు చేసిన కంపెనీ రానున్న కాలానికి మరిన్ని పెద్ద గోల్స్ పెట్టుకుంది. ప్రస్తుతం ఈ విజయంతో కంపెనీ తన తరువాతి ఫేజ్ గ్రోత్ జర్నీని ప్రారంభిస్తుందని కంపెనీ భావిస్తోంది. అయితే Q3లో మంచి ఫలితాలను సాధించామని వెల్లడించిన విస్తారా ఎంత లాభాన్ని ఆర్జించిందనే సంఖ్యలను మాత్రం విడుదల చేయలేదు. ఈ ఫలితాలు మార్కెట్ వర్గాల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. విస్తారాను లాభాల బాట పట్టించిన టాటాలు త్వరలోనే ఎయిర్ ఇండియాను సైతం గాడిన పెట్టగలని వారు భావిస్తున్నారు.