మాల్యా, నీరవ్ భారత చట్టాలను ఫేస్ చేయాల్సిందే: నిర్మలమ్మ
బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి, విదేశాల్లో తలదాచుకుంటోన్న విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు భారత చట్టాలను ఫేస్ చేయాల్సిందేనని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాజ్యసభలో బీమా సవరణ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. చట్టపరమైన చర్యలు ఎదుర్కోవడానికి వారిని భారత్ రప్పిస్తున్నట్లు వెల్లడించారు. వారిని మన దేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అక్కడి న్యాయస్థానాలను ఆశ్రయించడం సహా అన్ని చర్యలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే.
రుణమాఫీపై తెలంగాణ గుడ్న్యూస్, కరోనా టైంలో ఖర్చు ఇలా...
ఇక్కడకు తీసుకు వస్తాం
'విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ వీరంతా కూడా భారత చట్టాలను ఎదుర్కొనేందుకు ఇక్కడకు తీసుకు వస్తున్నాం. ఇక్కడి చట్టాలు ఫేస్ చేసేందుకు ఒకరి తర్వాత ఒకరిని తీసుకు వస్తాం' అని నిర్మలమ్మ అన్నారు. మోసాలకు పాల్పడినందుకు గాను వారు ఇక్కడి చట్టాలను ఎదుర్కోవాల్సిందే అన్నారు.
రప్పించేందుకు ప్రయత్నాలు
నీరవ్, విజయ్ మాల్యా ప్రస్తుతం బ్రిటన్లో విచారణను ఎదుర్కొంటున్నారు. వారి అప్పగింత కోసం కేంద్ర ప్రభుత్వం బ్రిటన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఇక నీరవ్ మామ మెహుల్ చోక్సీ ప్రస్తుతం ఆంటిగ్వాలో ఉంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆంటిగ్వాతో భారత్కు నేరస్తుల అప్పగింత ఒప్పందం లేదు. అయినప్పటికీ భారత్లో అవినీతికి పాల్పడినందుకు గాను భారత ప్రభుత్వం కోరితే అప్పగించేందుకు సిద్ధమని ఆంటిగ్వా అధినేత ఇదివరకే ప్రకటించారు.
బ్యాంకులకు మోసం
విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం పలు బ్యాంకుల నుండి రూ.9000 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నాడు. వాటిని చెల్లించకుండా 2016లో బ్రిటన్కు పారిపోయాడు. దీనిపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు బ్రిటన్ ప్రభుత్వాన్ని సంప్రదించాయి. ఆయన అప్పగింతపై అక్కడి కోర్టుల్లో విచారణ సాగింది. మాల్యా అప్పగింతపై బ్రిటన్ హోంమంత్రిత్వ శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు PNBలో నీరవ్, మెహుల్ రూ.13వేల కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డారు. నీరవ్ బ్రిటన్ జైలులో ఉన్నారు.