మాల్యా, చోక్సీ, నీరవ్ల నుండి రూ.13,100 కోట్లు రికవరీ: ఎగ్గొట్టిన దాంట్లో 80% రికవరీ
బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీలకు చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) వేలం వేసింది. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తంలో ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియంకు రూ.792.11 కోట్లు వచ్చాయి. ఇప్పటి వరకు ED రూ.13,109.17 కోట్ల విలువైన అసెట్స్ను బ్యాంకులకు అప్పగించింది.
పై ముగ్గురికి చెందిన రూ.9,371.17 కోట్ల విలువైన ఆస్తులను బ్యాంకులకు, ప్రభుత్వానికి అప్పగించింది ఈడీ. వీరికి చెందిన రూ.18,170.02 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. మాల్యా, చోక్సీ, నీరవ్ వల్ల బ్యాంకులకు జరిగిన నష్టంలో అటాచ్ చేసిన ఈ వాటా 80.45 శాతం. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(PMLA) కింద ఈడీ ఈ ఆస్తులను సీజ్ చేసింది.
వీరి ముగ్గురి నుండి బ్యాంకులు తీసుకున్న రుణాలను వసూలు చేసే ప్రయత్నాలు చేస్తోంది. విజయ్ మాల్యా తన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కార్యకలాపాలు నిలిపివేసిన తర్వాత బ్యాంకులకు రూ.9000 కోట్లు చెల్లించవలసి ఉంది. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.14000 కోట్లకు పైగా బాకీ ఉన్నారు.