లండన్ కోర్టులో విజయ్ మాల్యాకు భారీ షాక్, బ్యాంకులకు ఊరట
కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాకు భారీ షాక్. మాల్యా దివాలాకోరేనని లండన్ కోర్టు స్పష్టం చేసింది. లండన్లోని చీఫ్ ఇన్సాల్వెన్సీస్ అండ్ కంపెనీస్ కోర్టు(ICC) న్యాయమూర్తి మైఖేల్ బ్రిగ్స్ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నేతృత్వంలోని 13 భారతీయ బ్యాంకులు విదేశాల్లోని మాల్యా ఆస్తుల స్వాధీనానికి చర్యలు చేపట్టడానికి మార్గం సుగమమైంది.
వీటికి సంబంధించి భారతీయ కోర్టుల్లో కేసు నడుస్తున్నందున విచారణపై స్టే ఇవ్వడంతో పాటు విచారణ వాయిదా వేయాలని విజయ్ మాల్యా తరఫు లాయర్లు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పు పైన అప్పీల్ చేయడానికి మాల్యా ప్రయత్నాలకు అనుమతి నిరాకరించింది. సముచిత సమయంలో మాల్యా అప్పులు పూర్తిగా చెల్లిస్తారనే విశ్వాసం లేనందున ఈ కేసులో స్టే ఇవ్వడం కుదరదన్నారు.
భారత దేశంలోని మాల్యా ఆస్తులను ఎస్బీఐ కన్సార్టియం స్వాధీనం చేసుకున్నది. తాజా కోర్టు నిర్ణయంతో విజయ్ మాల్యాకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంకు మార్గం సుగమమైంది.