Flight Tickets: బాటిల్ వాటర్ ధరకే విమాన టిక్కెట్లు..! విమాన సంస్థ సూపర్ ఆఫర్.. విదేశాలకు..
Flight Tickets: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ఇటీవల ఆటోలు, ట్యాక్సీలు, బస్సుల ఛార్జీలు భారీగా పెరిగాయి. అదే సమయంలో.. విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) ధరలు సైతం భారీగా పెరిగాయి. దీంతో విమానయాన సంస్థలు కూడా విమాన టిక్కెట్ల ధరలను పెంచుతున్నాయి. వీటన్నింటి మధ్య.. ఈ వార్త మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వార్తను వినగానే మీకు నమ్మకపోయి ఉండవచ్చు, కానీ.. అది నిజమే. కేవలం రూ.26కే విమాన ప్రయాణ టికెట్ ను ఈ సంస్థ అందిస్తోంది. విషయం ఏమిటంటే.. వియత్నాంకు చెందిన విమానయాన సంస్థ వియట్జెట్ స్మోకీ ఆఫర్ను తీసుకొచ్చింది. చైనీస్ వాలెంటైన్స్ డేగా జరుపుకునే డబుల్ సెవెంత్ ఫెస్టివల్ తరహాలోనే.. వియట్జెట్ ఈ ఆఫర్ను తీసుకొచ్చింది.
గోల్డెన్ వీక్లో చాలా చౌకగా టిక్కెట్లు..
VietJet కస్టమర్లకు గోల్డెన్ వీక్ తీసుకొచ్చింది. ఇందులో ఈ విమానయాన సంస్థ ప్రమోషనల్ టిక్కెట్లను తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. విమానయాన సంస్థ ఈ గోల్డెన్ వీక్లో 7,77,777 దేశీయ, అంతర్జాతీయ టిక్కెట్లను డిస్కౌంట్లతో విక్రయిస్తోంది. ఈ టిక్కెట్ల ధరలు 7,700 వియత్నామీస్ డాంగ్ (VND) నుంచి ప్రారంభమవుతాయి. ఈ ప్రచార ఆఫర్ టిక్కెట్లపై జూలై 7 నుంచి జూలై 13 వరకు అందుబాటులో ఉంటుంది. వియట్జెట్ వెబ్సైట్ www.vietjetair.comని సందర్శించడం ద్వారా కస్టమర్లు ఈ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో.. కస్టమర్స్ Vietjet SkyClub ద్వారా బుకింగ్ లేదా చెల్లింపులు చేస్తే ఎలాంటి రుసుము ఉండదు.
మన కరెన్సీ ప్రకారం..
వియట్జెట్ ఎయిర్లైన్స్ విక్రయించే ప్రచార టిక్కెట్లు 7,700 వియత్నామీస్ డాంగ్తో ప్రారంభమవుతాయి. అయితే.. ఈ మొత్తాన్ని మన భారత కరెన్సీలోకి మార్చినప్పుడు దాని విలువ కేవలం 26 రూపాయలు అవుతుంది. ఎందుకంటే.. ఒక వియత్నామీస్ డాంగ్ (VND) ధర 0.0034 భారత రూపాయలకు సమానం. ఆ విధంగా 7,700 వియత్నామీస్ డాంగ్ విలువ దాదాపు రూ.26 కావటంతో ఇది ఒక వాటిర్ బాటిల్ ధరకు సమానం అని చెప్పుకోవచ్చు.
ఏ మార్గాలకు ప్రచార టిక్కెట్లు ఉన్నాయి..
VietJet వెబ్సైట్లో అందించిన సమాచారం ప్రకారం.. ఈ ప్రచార టిక్కెట్లు వియత్నాంలోని దేశీయ రూట్లు, అంతర్జాతీయ రూట్లకు వర్తిస్తాయి. "ప్రమోషనల్ టిక్కెట్లు భారతదేశం, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, ఇండోనేషియా (బాలీ), థాయ్లాండ్, సింగపూర్, మలేషియాలోని ఆకర్షణీయమైన గమ్యస్థానాలకు అందుబాటులో ఉన్నాయి. విమాన వ్యవధి ఆగస్టు 15, 2022 నుంచి మార్చి 26, 2023 వరకు ఉంటుంది" అని ఎయిర్లైన్ సంస్థ తన వెబ్సైట్లో పేర్కొంది.
ఇండియా నుంచి విమానాలు..
విమానయాన సంస్థ నాలుగు సేవలు దేశంలో అందుబాటులో ఉన్నాయి. VietJet కొంతకాలం క్రితం భారతదేశానికి అధికారికంగా నాలుగు సేవలను ప్రారంభించింది. ఈ సేవలు దేశంలోని ముంబై నగరం నుంచి వియత్నామీస్ నగరం హో చి మిన్ సిటీ/హనోయి, న్యూ ఢిల్లీ/ముంబై నుంచి ఫు క్వాక్ వరకు ఉన్నాయి. న్యూ ఢిల్లీని హో చి మిన్ సిటీ/హనోయితో కలుపుతూ రెండు దేశాల మొదటి ప్రత్యక్ష విమాన సేవలు ఏప్రిల్లోనే ప్రారంభమయ్యాయి. ఈ మార్గంలో ప్రతి వారం మూడు నుంచి నాలుగు విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. సెప్టెంబర్ 9, 2022 నుంచి ముంబై-ఫు క్వాక్ మార్గంలో ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో నాలుగు వారపు విమానాలను ప్రవేశపెడతామని VietJet ఇప్పటికే వెల్లడించింది. అలాగే.. న్యూఢిల్లీ-ఫు క్వాక్ మధ్య సర్వీసులు కూడా సెప్టెంబర్ 9, 2022 నుంచి ప్రారంభమవుతాయి. ఈ విమానాలు ప్రతి బుధ, శుక్ర, ఆదివారాల్లో ప్రయాణాలకు అందుబాటులో ఉంటాయి.