కొత్త వెహికిల్ స్క్రాపేజీ విధానం ఇదే, 35,000 ఉద్యోగాలు
కాలుష్యపరంగా, ఆర్థికంగా భారంగా మారిన పాత వాహనాలను తుక్కు కిందికు మార్చే వెహికిల్ స్క్రాపింగ్ విధానాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల పార్లమెంటు ఉభయసభల్లో ప్రకటించారు. పదిహేనేళ్లు పైబడిన కమర్షియల్ వెహికిల్స్, ఇరవై ఏళ్లు పైబడిన ప్రయివేటు వాహనాలు అన్ఫిట్గా తేలి, వాటి రిజిస్ట్రేషన్లు పునరుద్దరించకుంటే అలాంటి వాటిని తుక్కుగా మార్చాలని ప్రకటించారు. ఇలాంటి నిబంధనలతో సంబంధం లేకుండా పదిహేనేళ్ళ పైబడిన అన్ని ప్రభుత్వ వాహనాలను సేవల నుండి ఉపసంహరించి తుక్కుగా మార్చి కొత్త వాహనాలకు వెళ్తే కొనుగోళ్లపై రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు.
35వేల ఉద్యోగాలు
అమెరికా, జపాన్, యూకే, జర్మనీ వంటి దేశాల్లో అనుసరించే ప్రపంచస్థాయి విధానాల ప్రకారం దేశంలో వాహన తుక్కు విధానాన్ని అమలు చేస్తారు. ఈ కొత్త విధానం అమలులోకి వచ్చిన అనంతరం ప్రత్యక్షంగా 10 వేలమందికి, పరోక్షంగా 35 వేలమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. కొత్త వాహనాల కొనుగోళ్లు పెరగడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.30 వేల కోట్ల నుండి 40వేల కోట్ల జీఎస్టీ ఆదాయం పెరగనుందని భావిస్తున్నారు.
వాహన స్క్రాపేజ్ ఇలా
ఫిట్ నెస్ పరీక్షలో విఫలమై, రెన్యూవల్కు వీలుకాని వాహనాలను ఎండ్ ఆఫ్ లైఫ్ వెహికిల్స్గా ప్రకటిస్తారు. అలాంటి వాటిని తప్పనిసరిగా సేవల నుండి తొలగించి, తుక్కుగా మార్చాలి. కమర్షియల్ వాహనాలు అయితే ఫిట్ నెస్ సర్టిఫికెట్ను 15ఏళ్ల తర్వాత తప్పనిసరిగా సేవలనుండి ఉపసంహరించాలి. లేదంటే వీటి ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఫీజు పెంచుతారు. ప్రయివేటు వాహనాలు అయితే ఇరవై ఏళ్ల తర్వాత తుక్కుగా మార్చాలి. లేదంటే వీటికీ రిజిస్ట్రేషన్ పునరుద్ధర ఛార్జీలు పెంచుతారు. ప్రభుత్వ వాహనాలకు పదిహేనేళ్ళు ఉంటుంది.
అమల్లోకి ఎప్పటి నుండి అంటే
కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత చట్టం ప్రకారం 2024 జూన్ 1వ తేదీ నుండి 20 ఏళ్లకు పైగా నడిచిన పాత వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తిగా నిలిపివేస్తారు. కమర్షియల్ వెహికిల్స్కు 2023 ఏప్రిల్ 1వ తేదీ నుండి రిజిస్ట్రేషన్ నిలిపివేస్తారు. రోడ్డు టాక్స్లపై మినహాయింపులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేశారు.
2021 అక్టోబర్ 1వ తేదీ నుండి ఫిట్నెస్ టెస్ట్, స్క్రాపింగ్ సెంటర్ల ఏర్పాటు నిబంధనల అమలు. పదిహేనేళ్లు పైబడిన ప్రభుత్వ వాహనాల స్క్రాపింగ్ ప్రారంభం 2022 ఏప్రిల్ 1వ తేదీ నుండి ఉంటుంది. కమర్షియల్ వాహనాలకు 2023 ఏప్రిల్ 1, ఇతర వాహనాలకు 2024 జూన్ 1వ తేదీ నుండి దశలవారీగా అమలు చేస్తారు.