Foxconn: గుజరాత్లో సెమీకండక్టర్ ఫ్యాక్టరీ అక్కడే.. వేల కోట్ల ప్రాజెక్ట్ వివరాలు..
Vedanta-Foxconn: ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తయారు చేసేందుకు సెమీకండక్టర్లు చాలా కీలకం. అనేక ఎలక్ట్రానికి ఉత్పత్తుల్లో ఇవి తప్పనిసరి. అయితే కరోనా, తైవాన్ చైనా ఉద్రిక్తతలు వంటి కారణాల వల్ల చిప్ షార్టేజ్ పెరిగిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభాన్ని సధ్వినియోగం చేసుకోవాలని భారత్ నిర్ణయించింది. సెమీకండక్టర్ల తయారీలోకి అడుగు పెట్టింది.
వేదాంత పెట్టుబడి..
గుజరాత్లోని అహ్మదాబాద్కు సమీపంలో ఉన్న ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో సెమీకండక్టర్ అండ్ డిస్ప్లే తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. దీనిని భారతదేశానికి చెందిన వేదాంత లిమిటెడ్, తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ల సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించాయి. దీని తర్వాత దేశీయ వ్యాపార దిగ్గజం టాటాలు సైతం సెమీకండక్టర్ల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
లక్షన్నర కోట్ల ప్రాజెక్ట్..
దేశంలో మెుట్టమెుదటి సెమీకండక్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు వేదాంత-ఫాక్స్కాన్ జాయింట్ వెంచర్ ఏకంగా రూ.1,54,000 కోట్లను వెచ్చించనుంది. ఇందుకోసం సంస్థలు గుజరాత్ ప్రభుత్వంతో గత సెప్టెంబరులో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. రైల్వే, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో గాంధీనగర్లో ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు.
రాజకీయ దుమారం..
ఈ ప్రాజెక్టుకు మహారాష్ట్ర మొదటి ఎంపిక కావడం.. ఆ తర్వాత అది గుజరాత్ కు తరలిపోవటం దేశంలో పెద్ద రాజకీయ దుమారానికి కారణంగా మారింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన సభ్యులు కూటమిని విడిచిపెట్టిన తర్వాత మహా వికాస్ అఘాడి ప్రభుత్వం పడిపోయిన సమయంలో ఈ ప్రకటన వెలువడింది. ఉద్ధవ్ ఠాక్రే తనయుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే.. అప్పట్లో ప్రాజెక్టు చేజారిపోవటంపై కొత్తగా ఏర్పాటైన షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
భారీ రాయితీలు..
గత ఏడాది జూలైలో గుజరాత్ ప్రభుత్వం ప్రకటించిన 'గుజరాత్ సెమీకండక్టర్ పాలసీ 2022-27' కింద వేదాంత-ఫాక్స్కాన్ ప్రాజెక్ట్కు భూమి కొనుగోలుపై జీరో స్టాంప్ డ్యూటీ లభించనుంది. దీనికి తోడు సబ్సిడీ నీరు, విద్యుత్ వంటి రాయితీలు, ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.