అమెరికాలో 2 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీకి ఆమోదం, ఒక్కొక్కరి ఖాతాల్లో 1,200 డాలర్లు
వాషింగ్టన్: కరోనా మహమ్మారి దెబ్బకు అమెరికా కుదేలైంది. పౌరులను ఆదుకునేందుకు, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ట్రంప్ ప్రభుత్వం రెండు లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. సెనేట్లో ఈ ప్యాకేజీకి ఆమోదం లభించింది. దీని ప్రకారం 75వేల డాలర్లలోపు ఆదాయం కలిగిన వారందరి ఖాతాల్లో 1,200 డాలర్లు (రూ.90 వేలు) చొప్పున అకౌంట్లో జమ కానున్నాయి. 1.5 లక్షల డాలర్లలోపు ఆదాయం ఉన్న దంపతులకు 2,400 డాలర్లు (1.86 లక్షలు), పిల్లలకు ఒక్కొక్కరికి 500 డాలర్ల వంతున ఇవ్వనున్నారు.
అమెరికన్లు తిరిగి వర్క్లోకి వెళ్లాలని కోరుకుంటున్నారని, అమెరికాను షట్ డౌన్ చేయలేమని ట్రంప్ తెలిపారు. సమస్య కంటే పరిష్కారం దారుణంగా ఉండకూడదన్నారు. మొత్తం 300 బిలియన్ డాలర్లు అమెరికన్ల అకౌంట్లలో నేరుగా పడనున్నాయి.
ఎయిర్లైన్స్ సహా అమెరికా కంపెనీలకు సహకారం కోసం 500 బిలియన్ డాలర్లు ట్రెజరీ డిపార్టుమెంట్కు వెళ్తాయి. 350 బిలియన్ డాలర్లు స్మాల్ బిజినెస్ల కోసం, 100 బిలియన్ డాలర్లు హాస్పిటల్స్, నర్సులు, డాక్టర్ల కోసం, 150 బిలియన్ డాలర్లు రాష్ట్రాలు, లోకల్ ప్రభుత్వాలకు, 300 బిలియన్ డాలర్లు ప్రజలకు ప్రత్యక్షంగా జమకానున్నాయి. పర్సనల్ ఉద్యోగులతో పాటు గిగ్ కార్మికులు, స్వతంత్ర కాంట్రాక్టర్ల కోసం 250 బిలియన్ డాలర్లు కేటాయించారు.
ఇదిలా ఉండగా, ఫ్లూ వల్ల చాలామందిని కోల్పోతామని, కానీ, దేశాన్ని తీవ్ర మాంద్యంలోకి, నిస్పృహలోకి నెట్టేస్తే ఇంకా ఎక్కువ మందిని కోల్పోతామని, వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటారని ట్రంప్ అంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యలను మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తప్పుపట్టారు. షట్డౌన్ చేయకుంటే వైరస్ను నియంత్రించే అవకాశాన్ని అమెరికా చేజార్చుకుంటుందన్నారు.
కరోనాతో వందల మంది మరణించారని, ఈ పరిస్థితుల్లో ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలనుకోవడం బాధ్యతారహితమని బిల్ గేట్స్ అన్నారు. ఆర్థిక వ్యవస్థకు తిరిగి జీవం పోయవచ్చునని, కానీ, చనిపోతే బతికించలేమన్నారు. కరోనా టెస్టింగ్ కిట్స్ కావాలని అమెరికా దక్షిణ కొరియాను కోరింది. భారత్లో వలె లాక్ డౌన్ ప్రకటించాలని కూడా అమెరికాలో డిమాండ్లు వినిపిస్తున్నాయి.