Twitter Blue: ట్విట్టర్ వల్ల ఫార్మా కంపెనీకి కష్టాలు.. వేల కోట్ల నష్టం.. జాగ్రత్త
Twitter Blue: అదేంటో ఎలాన్ మస్క్ నిర్ణయాలు బెడిసికొడుతున్నాయి. ఆయన చేస్తున్న ప్రకటనలు, తీసుకుంటున్న నిర్ణయాల వల్ల చెడు కూడా భారీగానే జరుగుతోంది. ఉద్యోగులను తొలగించటం నుంచి ట్విట్టర్ బ్లూ సబ్ స్క్రిప్షన్ వరకు దొర్లుతున్న తప్పుల తీవ్రతను తాజా పరిణామం చెప్పకనే చెబుతోంది.
ట్విట్టర్ బ్లూ టిక్..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయం వల్ల ఏకంగా ఒక కంపెనీ బిలియన్ డాలర్లను కోల్పోయింది. అవును ట్విట్టర్ కొత్త బాస్ బ్లూ టిక్ వెరిఫికేషన్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 8 డాలర్లు చెల్లించినవారికి బ్లూ టిక్ పొందవచ్చని ప్రకటించటంతో నకిలీగాళ్లు రెచ్చిపోతున్నారు. అలా ఓ నకిలీ బ్లూ టిక్ ఖాతా అమెరికా దిగ్గజ ఫార్మా కంపెనీకి భారీ నష్టాన్ని కలిగించింది.
|
ఫార్మా కంపెనీ..
యూఎస్ ఫార్మా జైంట్ ఎలి లిల్లీ పేరుతో మోసగాళ్లు నకిలీ బ్లూ టిక్ ఖాతాను తెరిచారు. దానిలో కంపెనీ ఇన్సులిన్ ఉచితంగా అందిస్తుందంటూ ట్వీట్ చేశారు. దీంతో కంపెనీ స్టాక్ ఒక్కసారిగా కుప్పకూలింది. వాల్ స్ట్రీట్ లో కంపెనీ పరిస్థితి తలకిందులైంది. ఈ ఫేక్ ట్వీట్ అంతటా వ్యాప్తి చెందటంతో కంపెనీ షేర్లు శుక్రవారం 4.37 శాతం క్షీణించటంతో కంపెనీ మార్కెట్ క్యాప్ 15 బిలియన్ డాలర్ల మేర ఆవిరైంది. గురువారం ఫేక్ ప్రకటన ట్వీట్ చేయబడటంతో శుక్రవారం స్టాక్ భారీగా పతనమైంది.
|
ట్విట్టర్ చర్యలు..
ట్విట్టర్ కంపెనీని ఎలాన్ మస్క్ స్వాధీనం చేసుకున్న తర్వాత కొత్త బ్లూ టిక్ వెరిఫికేషన్ రూల్స్ ప్రకటించాక చాలా మంది సెలబ్రిటీలు, ప్రసిద్ధ కంపెనీల పేరుతో నకిలీ ఖాతాలను తెరిచారు. బ్లూ టిక్ కొత్త విధానం అమలులోకి వచ్చి రెండు రోజులు గడవక ముందే ఈ వ్యవహారం జరగటం ఆందోళన కలిగిస్తోంది. విస్తరించిన నకిలీ ఖాతాలను అరికట్టేందుకు ట్విట్టర్ చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కొత్త విధానం ద్వారా చెక్మార్క్ సిస్టమ్ కోసం సైన్-అప్లను సస్పెండ్ చేసింది. కొన్ని ఖాతాలకు గ్రే రంగు "అధికారిక" బ్యాడ్జ్ను పునరుద్ధరించింది.
ఎలి లిల్లీ స్పందన..
నకిలీ ఖాతా ద్వారా ఉచిత ఇన్సులిన్ అంటూ వచ్చిన ప్రకటనపై ఫార్మా కంపెనీ ఎలి లిల్లీ తన ఒరిజినల్ ట్విట్టర్ ఖాతా నుంచి ఒక వివరణను జారీ చేసింది. నకిలీ ఖాతా నుంచి ప్రజలను తప్పుదోవపట్టించే సమాచారంపై క్షమించాలని కంపెనీ తమ అధికారిక ఖాతా నుంచి కోరింది. కంపెనీ ఆదాయాన్ని పెంచటానికి ఎలాన్ మస్క్ Twitter బ్లూ కోసం వినియోగదారుల నుంచి నెలకు $8 వసూలు చేయాలని నిర్ణయించాడు. భారతదేశంలో దీని రుసుమును రూ.719గా నిర్ణయించింది. అయితే ఫేక్ అకౌంట్ల వెల్లువను దృష్టిలో ఉంచుకుని ట్విట్టర్ ఈ సేవలను ప్రస్తుతానికి నిలిపివేసింది.