ఇప్పుడు గూగుల్ వంతు: వొడాఫోన్-ఐడియాలో పెట్టుబడి...? 5 శాతం వాటా కోనుగోలు...
ముఖేశ్ అంబానీ జియోలోకి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. 10 మిలియన్ డాలర్ల పెట్టుబడిని ఫేస్బుక్, ఇతర అమెరికా కంపెనీలు పెట్టుబడి పెట్టారు. జియో తర్వాత వొడాఫోన్ ఐడియాలో పెట్టుబడి పెట్టాలని గూగుల్ భావిస్తోంది. ప్రపంచంలో వేగంగా విస్తరిస్తోన్న ఫేస్బుక్కు వ్యతిరేకంగా తాను కూడా వాటా పెట్టాలని గూగుల్ భావిస్తోందని 'ఫైనాన్షియల్ టైమ్స్' రిపోర్ట్ చేసింది.
బ్రిటన్కు చెందిన వొడాఫోన్, భారత్కు చెందిన ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన వొడాఫోన్ ఐడియాలో 5 శాతం వాటా కొనుగోలు చేయాలని గూగుల్ భావిస్తోంది. 2018లో వొడాఫోన్ ఐడియా ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందులో గూగుల్ పెట్టుబడి పెట్టడంతో కంపనీ ఉన్నత లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది.
ఆదిత్య బిర్లాకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు ఉంది. బిలియన్ డాలర్లు చెల్లించాల్సిందేనని.. లేదంటే కంపెనీ కార్యకలాపాలను మూసివేయాలని స్పష్టంచేసింది. ఏజీఆర్ కింద వొడాఫోన్ ఐడియా 58 వేల 254 కోట్లు బకాయి ఉంది. 6 వేల 854 కోట్లు చెల్లించాలని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్ ఇదివరకే కోరింది. ఈ సమయంలో గూగుల్ వాటా కొనుగోలు చేయడంతో కంపెనీతోపాటు.. ఆదిత్య బిర్లా కంపెనీకి మేలు కలుగుతుంది.