ఇండియాకు ఐఎంఎఫ్ వార్నింగ్: అప్పులు పెరుగుతున్నాయి జాగ్రత్త!
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐ ఎం ఎఫ్ ).. ఇండియాకు ఒక వార్నింగ్ చేసింది. భారత ఆర్థిక వ్యవస్థను గమనిస్తే... ఇండియాలో అప్పులు బాగా పెరిగిపోతున్నాయని, వాటితో జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడుతోందని తెలిపింది. ఈ పరిణామం నుంచి బయట పడాలంటే వెంటనే నిర్మాణాత్మక ఆర్థిక సరళీకరణ చర్యలు చేపట్టాలని సూచించింది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చిన ఐఎంఎఫ్ అధికారిక ప్రతినిధి గేరి రైస్ పై విధంగా వ్యాఖ్యానించారు. బడ్జెట్ లో కేవలం రంగాల వారిగా చేపట్టే అంశాలు మాత్రమే ఉన్నాయి. కానీ దేశంలో పెరుగుతున్న అప్పుల దృష్ట్యా... ఇండియా వెంటనే నిర్మాణాత్మకమైన ఆర్థిక సరళీకరణలు అమలు చేయాల్సి ఉంటుంది. అదే ప్రధాన లక్ష్యంగా చేసుకుని నిర్దిష్టమైన మధ్యకాలిక ద్రవ్య ప్రణాళికలు రూపొందించాలి అని గేరి రైస్ సూచించారు. ఈ మేరకు ప్రముఖ వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక కథనాన్ని ప్రచురించింది.
రుణాలు ఇవ్వకుంటే ఫిర్యాదు చేయండి: నిర్మలా సీతారామన్
జీడీపీ వృద్ధి 4.8% ....
భారత జీడీపీ వృద్ధి పై ఐ ఎం ఎఫ్ తొలుత వేసిన అంచనాల కంటే భారత జీడీపీ నెమ్మదించినట్లు గేరి రైస్ వెల్లడించారు. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా... ఆర్థికపరమైన చర్యలు తీసుకుని, పెరుగుతున్న అప్పులకు కళ్లెం వేయాల్సిందేనని సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇండియన్ జీడీపీ వృద్ధి కేవలం 4.8% నికి పరిమితం అవుతుందని చెప్పారు. గతంలో ఐ ఎం ఎఫ్ 6% వృద్ధిని, తర్వాత 5% వృద్ధిని అంచనా వేసినా ... క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు అనుగుణంగా లేకపోవటంతో చివరకు కేవలం 4.8% వృద్ధిని మాత్రమే నమోదు చేసే అవకాశం ఉంటుందని పేర్కొంది. అంటే, ఇండియాలో ఆర్థిక మందగమనం స్పష్టంగా ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. కానీ, దీనిని అంగీకరించేందుకు ప్రభుత్వ పెద్దలు మాత్రం ముందుకు రాకపోవటం విచారకరం.
1293 బిలియన్ డాలర్ల అప్పులు...
భారత ప్రభుత్వ అప్పులు గతంలో కంటే తగ్గుముఖం పడుతున్నప్పటికీ... ఇటీవలి కాలంలో మళ్ళీ అవి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రపంచ ఆర్థిక సంస్థ మరో సారి ఇండియాను హెచ్చరిస్తోంది. పెరుగుతున్న అప్పులకు కళ్లెం వేయాలని సూచిస్తోంది. 2019 సెప్టెంబర్ నాటికీ భారత ప్రభుత్వ అప్పులు 1293 బిలియన్ డాలర్లు గా ఉన్నాయి. అంటే అక్షరాలా రూ 90,51,000 కోట్లు అన్నమాట. ఈ అప్పుల వాటా మన దేశ జీడీపీ లో 44.5% నికి సమానంగా ఉంది. ఇది ఏ మాత్రం పెరిగినా దేశ ఆర్థిక పరిస్థితులు తలకిందులు అవుతాయి. విదేశీ చెల్లింపుల సామర్థ్యం తగ్గిపోతుంది. అప్పుడు చెల్లింపుల సమస్య తలెత్తుంది.
చేతలు కావాలి...
2014 లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఆద్వర్యంలోని ప్రభుత్వం పెద్ద లక్ష్యాలను గొప్పగా ప్రచారం చేసుకుంటోంది కానీ వాటి అమలును పట్టించుకోవటం లేదు అన్నది ఆర్థికవేత్తల్లో ఉన్న అనుమానం. దాదాపు ఏడాదికి పైగా ఆటోమొబైల్ అమ్మకాలు తగ్గుతూ... దేశంలో అన్ని రంగాల్లో డిమాండ్ పడిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటోందని వారు ఆరోపిస్తున్నారు. ఏడాది కాలంలోనే జీడీపీ వృద్ధి 7% పై నుంచి 4.5% నికి పడిపోయినా ప్రభుత్వంలో చలనం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ రేటు గత నలభై ఏళ్లలో అత్యధిక స్థాయిలో ఉన్నా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టటం లేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక అప్పులు కూడా పెరిగిపోతే దేశం అధోగతి పాలు అవుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేలుకుని భారత ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు నడుం బిగించాలని, తగిన చర్యలు తీసుకుని, తాము చేతల ప్రభుత్వం కూడా అని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడుతున్నారు.