కొత్త నైపుణ్యాలతో మంచి ఉద్యోగాలు వచ్చాయ్, శాలరీ పెరిగింది
కరోనా మహమ్మారి జాబ్ మార్కెట్ పైన తీవ్ర ప్రభావం చూపింది. జాబ్ మార్కెట్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. టెక్నాలజీ మార్పుకు అనుగుణంగా స్కిల్స్ పెంచుకోవడం మంచి ఉద్యోగం సంపాదించడానికి, అలాగే వేతన పెంపుకు దోహదపడిందని ఎక్కువమంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఓ సర్వేలో అభిప్రాయపడ్డారు. 53 శాతం మందికి పైగా అప్-స్కిల్లింగ్ తమ వేతన పెంపుపై ప్రభావం చూపిందని సర్వేలో తెలిపారు. ఈ మేరకు టీంలీజ్ ఎడ్టెక్ తాజాగా ఇంపాక్ట్ ఆఫ్ అప్స్కిల్లింగ్ ఆన్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ పేరుతో సర్వే చేసింది.
కొత్త నైపుణ్యాలతో...
ఈ సర్వే ప్రకారం అప్-స్కిల్లింగ్ కారణంగా మెరుగైన ఉద్యోగంలోకి మారినట్లు పలువురు తెలిపారు. కొత్త నైపుణ్యాల వల్ల మంచి ఉద్యోగం సంపాదించామని లేదా మంచి పొజిషన్లోకి వెళ్లామని 84 శాతం మంది వెల్లడించారు. ఇండస్ట్రీ ట్రెండ్స్కు అనుగుణంగా నైపుణ్యతను పెంచుకోవడం ద్వారా యజమానిపై, స్నేహితులపై ఆధారపడటం తగ్గిందని 54.3 శాతం మంది తెలిపారు. భవిష్యత్తులోను కొత్త నైపుణ్యతను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకుంటామని తెలిపారు.
ఉద్యోగ భద్రతపై ఆందోళన..
11 రంగాల్లోని 1039 ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొన్నారు. గత ఏడాది కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు, కంపెనీలకు సవాళ్లతో కూడిన సమయంగా మిగిలిందని, ఉద్యోగులు తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందారని, అలాగే ఇంక్రిమెంట్స్ వంటి వాటిపై ఆవేదన చెందారని టీమ్ లీజ్ ఎడ్టెక్ ఫౌండర్, సీఈవో శాంతాను రూజ్ అన్నారు.
అవకాశంగా...
కరోనా సమయంలో ఉద్యోగ భద్రతపై చాలామంది ఉద్యోగులు ఆందోళనగా కనిపించినప్పటికీ దీనిని అవకాశంగా చాలామంది భావించారు. కొత్త నైపుణ్యాలపై దృష్టి పెట్టి, వాటిని నేర్చుకోవడానికి ఆసక్తి కనబరిచారు. కరోనా సమయంలో కనీసం ఒక్క కొత్త విషయాన్ని అయినా నేర్చుకున్నామని సర్వేలో పాల్గొన్న 75 శాతం మంది తెలిపారు. చాలామంది ఉద్యోగులు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంతో పాటు మంచి వేతన పెంపును ఆశిస్తున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. 73 శాతం మంది మంచి అవకాశాలు ఉంటాయని చెప్పారు.