UPI Services: యూపీఐ ఛార్జీలపై కేంద్రం క్లారిటీ.. RBI అలా.. కేంద్రం ఇలా..! ఆర్థిక మంత్రి ట్వీట్..
UPI Services To Remain Free: గత వారం డిజిటల్ యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే అంశంపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజాభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపించింది. ఇది నిజంగా అమలులోకి వస్తే ప్రజలు మళ్లీ డబ్బు వినియోగానికి వెళ్లే ప్రమాదం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ప్రస్తుతానికి వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది.
|
కేంద్రం వివరణ..
UPI లావాదేవీలు సర్వీస్ ఛార్జీల వ్యవహారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం స్పందించారు. UPI ప్రజలకు అపారమైన సౌలభ్యం & ఆర్థిక వ్యవస్థకు ఉత్పాదకత లాభాలతో కూడిన డిజిటల్ పబ్లిక్ గూడ్ అని ఆమె అన్నారు. UPI సేవలకు ఎటువంటి ఛార్జీలు విధించే విషయంపై ప్రభుత్వం వద్ద ప్రస్తుతం ఎటువంటి పరిశీలన లేదని వెల్లడించారు. కాస్ట్ రికవరీ కోసం సర్వీస్ ప్రొవైడర్ల ఆందోళనలను ఇతర మార్గాల ద్వారా తీర్చేందుకు ప్రయత్నించనున్నట్లు ఆర్థిక మంత్రి తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.
ప్రభుత్వ సాయం..
కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థకు ఆర్థిక సహాయాన్ని అందించిందని.. చెల్లింపు ప్లాట్ఫారమ్లను ఆర్థికంగా, వినియోగదారు-స్నేహపూర్వకంగా ప్రోత్సహించడాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగించనున్నట్లు ఆమె తన ట్వీట్ లో వెల్లడించారు. RBI పేపర్లో UPI సిస్టమ్ ద్వారా జరిగే ప్రతి ఆర్థిక లావాదేవీకి రుసుము వసూలు చేసే ఆలోచన అంశాన్ని మీడియా సంస్థలు ప్రచురించిన తరుణంలో అనేక మంది సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని వివరణ కోరారు. దీంతో తాజాగా ఆర్థిక మంత్రి స్పందించినట్లు తెలుస్తోంది.
అసలు రిజర్వు బ్యాంక్ ఏమంది..?
RBI చర్చా పత్రంలో కేవలం UPIపై మాత్రమే కాకుండా.. IMPS, NEFT, RTGS, డెబిట్, క్రెడిట్ కార్డ్లు, PPIల వంటి ఇతర చెల్లింపు వ్యవస్థలపై ఛార్జీలకు సంబంధించిన అన్ని అంశాలను కవర్ చేసింది. చెల్లింపు సేవలకు సంబంధించిన ఛార్జీలు వినియోగదారులకు సహేతుకమైనవి, పోటీతత్వంతో నిర్ణయించబడతాయి. అదే సమయంలో సర్వీస్ ప్రొవైడర్లకు సరైన ఆదాయ ప్రవాహాన్ని అందిస్తాయని చర్చా పత్రంలో రిజర్వు బ్యాంక్ పేర్కొంది. అయితే దీనిని బ్యాలెన్స్ చేసేందుకు, అన్ని రకాల డిజిటల్ చెల్లింపు వ్యవస్థల్లో వివిధ పరిమితులకు సంబంధించి చేసే అన్ని ట్రాన్సాక్షన్లపై ఎంత ఛార్జీలు ఉంచాలనేదానిపై అభిప్రాయాలను తెలుసుకునేందుకు రిజర్వు బ్యాంక్ ఈ చర్చా పత్రాన్ని తీసుకొచ్చింది.