30,000 మంది కస్టమర్లు, 6 బ్యాంకులతో యూనిటెక్ చెలగాటం: బయట పడుతున్న విస్తుపోయే నిజాలు
యూనిటెక్ లిమిటెడ్ అంటే దేశంలోని అతి పెద్ద నిర్మాణ రంగ కంపెనీల్లో ఒకటి. ముఖ్యంగా భారీ హోసింగ్ ప్రాజెక్టులకు పెట్టింది పేరు. కానీ కంపెనీలో అవకతవకలు బయట పడటంతో సుప్రీమ్ కోర్ట్ ఈ కంపెనీ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించింది. ఆ ఆడిటింగ్ లో విస్తు గొలిపే నిజాలు బయట పడుతున్నాయి. కొన్నేళ్లుగా ఈ కంపెనీ సుమారు 30,000 మంది కొనుగోలుదారులు, 6 బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో చెలగాటం ఆడినట్లు తేలింది.
అలాగే పెద్ద ఎత్తున కంపెనీ నిధులు దారి మల్లాయని, పన్ను స్వర్గ దేశాలకు తరలిపోయాయని సమాచారం. ఈ మేరకు ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని ప్రచురించింది. దాని ఆధారంగా మీ కోసం కొన్ని విషయాలు. యూనిటెక్ లిమిటెడ్ దేశంలో చేపట్టిన 74 హౌసింగ్ ప్రోజెక్టుల కోసం 29,800 మంది హోమ్ బయ్యర్ల నుంచి రూ 14,270 కోట్ల డిపాజిట్లను సేకరించింది. అలాగే 6 ఆర్థిక సంస్థల నుంచి రూ 1,806 కోట్లను రుణాలుగా తీసుకుంది.
40% వాడనే లేదు...
ప్రాజెక్టులను పూర్తి చేసి గృహాలను అందించేందుకు వినియోగదారుల నుంచి సేకరించిన సొమ్ములో దాదాపు 40% నిధులను (రూ 5,063 కోట్లు) ఆ పని కోసం యూనిటెక్ వినియోగించలేదని ఆడిటింగ్ లో తేలింది. అదే సమయంలో రూ 2,389 కోట్ల నిధులు ఎటు వెళ్లిందీ తేలటం లేదు. వీటి గుట్టు రట్టు చేయాల్సి ఉంది. మొత్తం 74 ప్రాజెక్టులకు గాను, ఆడిటింగ్ సంస్థ 51 ప్రాజెక్టులను మాత్రమే ఆడిట్ చేయగలిగింది. మరో 23 ప్రాజెక్టులకు సంబందించిన వివరాలను కంపెనీ అందజేయలేక పోయింది. దీంతో ఇక చేసేది లేక, ఉన్న వివారాలతోనే ఆడిటింగ్ సంస్థ తన నివేదికను రూపొందించినట్లు సమాచారం.
సైప్రస్ కు చేరిన రూ 1,746 కోట్లు...
యూనిటెక్ లిమిటెడ్ పెద్ద ఎత్తున నిధులను పన్ను స్వర్గ ధామ దేశాలకు తరలించినట్లుగా భావిస్తున్నారు. 2007 నుంచి 2010 మధ్య కాలంలో యూనిటెక్ గ్రూప్ కు చెందిన 3 అనుబంధ సంస్థలు సైప్రస్ అనే టాక్స్ హెవెన్ దేశంలో రూ 1,746 కోట్ల పెట్టుబడి పెట్టాయి. ఒకే దేశంలోని 10 కంపెనీల్లో ఈ మేరకు పెట్టుబడులు పెట్టాయి. కానీ, అందులో 80% అంటే రూ 1,406 కోట్ల పెట్టుబడులను రైట్ ఆఫ్ చేసుకున్నాయి. అంటే దానర్థం ఆ పెట్టుబడులు ఇక తిరిగి రావని. మిగిలిన నిధులను మాత్రం ఈక్విటీ రూపంలో ఖాతాల్లో చూపినట్లు తేలింది. మరో వైపు అనేక రిలేటెడ్ పార్టీ లకు సంబంధించిన లావాదేవీల సమాచారం కూడా అందుబాటులో లేదని తేసుస్తోంది. సాధారణంగా అయితే ఏ చిన్న కంపెనీ అయినా రిలేటెడ్ పార్టీ లావాదేవీ ఉంటే దానిని స్పష్టంగా పేర్కొంటారు. కానీ ఇంత పెద్ద కంపెనీ లో అనేక అవకతవకలు జరుగుతుంటే ఎవరూ పట్టుకోలేక పోవటం గమనార్హం.
అమ్మినవాటికీ దిక్కులేదు..
నిధుల దారి మల్లింపు పలు విధాలుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. యూనిటెక్ విషయంలోనూ అలాగే కనిపిస్తోంది. 2009-2011 మధ్య కాలంలో యూనిటెక్ గ్రూప్ తన ఐదు అనుబంధ సంస్థలను రూ 493 కోట్లకు విక్రయించినట్లు బుక్స్ లో చూపారు. కానీ ఆయా కంపెనీలను ఎవరికి విక్రయించినదీ వెల్లడించలేదు. పైగా ఇప్పటికీ ఆ లావాదేవీకి సంబంధించి రూ 294 కోట్లు యూనిటెక్ కు రావాల్సి ఉన్నట్లు రాసుకున్నారు. ఇదే రకంగా రిలేటెడ్ పార్టీ లావాదేవీలు కూడా పలు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయి. ఒక రిలేటెడ్ పార్టీ కి సంబంధించిన కంపెనీ షేర్ల కొనుగోలు కోసం రూ 237 కోట్లు 2011-13 మధ్య కాలంలో చెల్లించినప్పటికీ ఇప్పటి వరకు యూనిటెక్ కు షేర్లు మాత్రం కేటాయించలేదు. ఇలాంటి తిరకాస్తు వ్యవహారాలు అనేకం ఫోరెన్సిక్ ఆడిట్ లో బయట పడ్డాయట.