జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్-డీజిల్.. మోదీ సర్కార్ సిద్ధమన్న Hardeep Singh Puri
Petrol Under GST: దేశంలో చాలా రోజుల నుంచి వాహనదారులతో పాటు అనేక మంది కోరుకుంటున్నారు. ఈ క్రమంలో నిన్న పెట్రోలియం శాఖ మంత్రి పెద్ద ప్రకటన చేశారు. దీంతో ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల్లో గుబులు మెుదలైంది.
మంత్రి ఏమన్నారంటే..
పెట్రోలు, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సోమవారం తెలిపారు. అయితే దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి అంగీకరించేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ దిశగా రాష్ట్రాలు చొరవ తీసుకుంటే కేంద్రం కూడా అందుకు సిద్ధంగా ఉందని పూరీ కుండబద్ధలు కొట్టి చెప్పారు.
ఆదాయం కోసం..
మద్యం, పెట్రోలియం ఉత్పత్తులు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరని మనందరికీ తెలిసిందే. అయితే పెట్రోల్-డీలిల్ లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటానికి ముందు దానిపై చర్చలు జరగాల్సి ఉంటుంది. ప్రజల నుంచి దీనిపై చాలా కాలం నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. దీనిపై రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరదని పెట్రోలియం మంత్రి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని వదులుకునే ఉద్ధేశ్యంలో లేరని.. అనేక విషయాలపై కేంద్రం మాత్రమే ఆందోళన చెందుతోందని అన్నారు.
హైకోర్టు నిర్ణయం..
జీఎస్టీ కౌన్సిల్లో ఈ అంశాన్ని చేపట్టాలని కేరళ హైకోర్టు సూచించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే రాష్ట్రాల ఆర్థిక మంత్రులు అంగీకరించలేదు. పెట్రోలు, డీజిల్ ధరల్లో అతి తక్కువ పెరుగుదల బహుశా భారతదేశంలోనే జరిగి ఉండవచ్చని మంత్రి తెలిపారు. మోర్గాన్ స్టాన్లీ కూడా భారతదేశం ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉందని చెప్పింది.
పన్నుల తగ్గింపులు..
ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా పెరుగుతున్న ముడి చమురు ధరల ప్రభావం నుంచి భారత్ తనను తాను రక్షించుకుందని పూరీ వెల్లడించారు. ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానం చెప్పనని, అయితే ధరలు స్థిరంగా ఉండాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఆంకాంక్షని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించటం లేదనే వంక చెప్పి కేంద్రం తప్పించుకుంటుందా లేక రాష్ట్రాలను ఇందుకు ఒప్పించి ప్రజలకు, వాహనదారులకు మేలు కలిగే చర్యలు తీసుకొస్తుందో చూడాలి. రానున్న కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించటం చాలా కీలకంగా మారనుందని తెలుస్తోంది.