Subsidy Loan: రైతన్నలకు శుభవార్త.. వడ్డీ రాయతీ రుణాలకు ఆమోదం.. ఎన్ని లక్షలంటే..
Subsidy Loan: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బుధవారం దేశంలోని రైతులకు పెద్ద కానుకను అందించింది. రూ.3 లక్షల వరకు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై 1.5 శాతం వడ్డీ రాయితీ పథకాన్ని పునరుద్ధరించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదంతో రైతులకు తక్కువ వడ్డీకే వ్యవసాయ రుణాలు అందనున్నాయి. ద్రవ్యోల్బణం సమయంలో రైతన్నలకు ఇది కలిసొచ్చే అశంగా చెప్పుకోవాలి.
ప్రభుత్వంపై పెరగనున్న భారం..
కేబినెట్ సమావేశం అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, కంప్యూటరీకరించిన PACSలు 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి 2024-25 వరకు, అంటే మూడు సంవత్సరాల పాటు ఈ రాయితీ రైతులు పొందుతారని తెలిపారు. క్యాబినెట్ ఆమోదం తెలపటంతో వడ్డీ రాయితీని భర్తీ చేయడానికి ప్రభుత్వం బడ్జెట్కు అదనంగా రూ.34,856 కోట్లు కేటాయించాల్సి ఉంటుందని వెల్లడించారు.
ఉద్యోగావకాశాలు కల్పించేందుకు..
వడ్డీ రాయితీ పథకాన్ని ముందుకు తీసుకెళ్లడం వ్యవసాయ రంగంలో రుణ ప్రవాహాన్ని కొనసాగించడంలో సహాయపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. దీనితో పాటు.. రుణ సంస్థల ఆర్థిక ఆరోగ్యం కూడా క్షీణించదు. ఇది బ్యాంకుల మూలధన వ్యయాన్ని తీర్చగలవు. రైతులకు స్వల్పకాలిక రుణాలు ఇచ్చేందుక ప్రోత్సాహంగా నిలుస్తుంది. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం, మత్స్య పరిశ్రమలతో పాటు వ్యవసాయానికి సంబంధించిన అన్ని ఇతర కార్యకలాపాలకు ఈ రుణాలు అందుబాటులో ఉంటాయి. చౌక రుణాల వల్ల ఉపాధితో పాటు అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
సకాలంలో చెల్లించేవారికి ప్రయోజనాలు..
సకాలంలో లోన్స్ వాయిదాలు చెల్లించే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. సకాలంలో చెల్లించే.. రైతులకు కేవలం 4 శాతం వడ్డీకే స్వల్పకాలిక రుణాలు లభిస్తాయి. రైతులకు సబ్సిడీ వడ్డీ రేట్లకు స్వల్పకాలిక రుణాలు అందించడమే దీని లక్ష్యం. ఈ పథకం కింద వ్యవసాయం, పశుపోషణ, పాడిపరిశ్రమ, కోళ్ల పెంపకం, మత్స్య పరిశ్రమ వంటి పనుల కోసం రైతులకు 7 శాతం వార్షిక వడ్డీ రేటుతో రూ.3 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఇదే సమయంలో.. వాయిదాలను సకాలంలో చెల్లించే రైతులకు 3 శాతం అదనంగా వడ్డీ రాయితీ అందుతుంది. క్రమం తప్పకుండా చెల్లింపులు చేసినట్లయితే భారీగా వడ్డీ రాయితీ లభిస్తుంది.
సబ్సిడీ, సబ్వెన్షన్ మధ్య వ్యత్యాసం..
వడ్డీ రాయితీ, సబ్సిడీ వేర్వేరు విషయాలు. ఉత్పత్తి, వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం రాయితీలు అందిస్తోంది. దీని కింద ఎంచుకున్న వస్తువులు లేదా సేవల విషయంలో ప్రభుత్వమే కొంత భాగాన్ని భరిస్తుంది. ప్రజలకు అందుబాటు ధరలకే ఆహార ధాన్యాలు అందించే పథకమే ఇందుకు ఉదాహరణ. అదే సమయంలో.. సబ్వెన్షన్ స్కీమ్ కింద లబ్ధిదారులకు రుణ వడ్డీలో ఉపశమనం ఇవ్వబడుతుంది. దీని ప్రకారం ప్రభుత్వం వడ్డీని చౌకగా చేస్తుంది.. కానీ పూర్తిగా రాయితీ ఇవ్వదన్నమాట.
హాస్పిటాలిటీ రంగానికి..
హాస్పిటాలిటీ రంగానికి అత్యవసర క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ నిధులను పెంచడానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. గతంలో రూ.4.5 లక్షల కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ.5 లక్షల కోట్లకు పెంచింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రూ.5 లక్షల కోట్లకు పెంచాలని ప్రతిపాదించారు. కరోనా మహమ్మారి కారణంగా హాస్పిటాలిటీ రంగానికి వరుస నష్టాల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో హాస్పిటాలిటీ, టూరిజం, సంబంధిత రంగాలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది.