Medicines prices: 70 మందులపై తగ్గనున్న ధరలు..! కేంద్రం సన్నాహాలు.. ఆగస్టు 15న ప్రకటించే అవకాశం..
Medicines prices: దేశ ఆరోగ్య రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ నిర్ణయం వల్ల అనేక లక్ష మంది రోగులకు ప్రయోజనం చేకూరనుంది. విషయం ఏమిటంటే.. క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులతో బాధపడే రోగులకు రానున్న రోజుల్లో గొప్ప ఉపశమనం లభిస్తుంది. ఈ వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందుల ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
స్వతంత్ర్య దినోత్సవం రోజు ప్రకటన..
ఆగస్టు 15న దీనికి సంబంధించిన ప్రకటించవచ్చని మీడియా కథనాల ప్రకారం తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారిక వర్గాలు కూడా వెల్లడించాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు చేసిందని, అయితే దాని ప్రకటనపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. ఈ వ్యాధుల చికిత్సకు సంబంధించిన కొన్ని మందుల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ.. వాటి ధరలను నియంత్రించేందుకు రంగంలోకి దిగుతోంది.
70 శాతం తగ్గనున్న ధరలు..
ఈ ప్రతిపాదన అమలైతే మందుల ధరలు దాదాపుగా 70 శాతం మేర తగ్గుతాయని తెలుస్తోంది. ఇది రోగులకు నిజంగా పెద్ద ఊరటనిచ్చే అంశం అని చెప్పుకోవాలి. జాతీయ నిత్యావసర ఔషధాల జాబితాలో కూడా మార్పులు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చివరిసారిగా 2015లో వీటి విషయంలో మార్పులు జరిగాయి. ఇందులో ఎక్కువ స్థాయిలో వాడే మందులు ఉంటాయి. దీనితో పాటు, రోగులు దీర్ఘకాలిక అవసరాల కోసం వినియోగించే మందుల ధరల రేట్లపై పరిమితి విధించాలని కేంద్రం నిర్ణయం తీసుకోనుంది.
కంపెనీలతో చర్చలు..
ఈ విషయంపై దేశంలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల ప్రతినిధులతో జూలై 26, 2022న కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనేక ఔషధాలపై వాణిజ్య మార్జిన్ 1000 శాతం కంటే ఎక్కువగా ఉండటంపై చర్చించారు. ప్రస్తుతం.. ఔషధ నియంత్రణ సంస్థ NPPA 355 ఔషధాల ధరపై పరిమితిని విధించింది. ఈ మందులు NLEMలో చేర్చబడ్డాయి. ఈ మందులపై ట్రేడ్ మార్జిన్ హోల్ సేల్ వ్యాపారులకు 8 శాతం, రిటైలర్లకు 16 శాతంగా ఉంటుంది.