కేంద్రం పండుగ శుభవార్త: రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రోత్సాహకాలు
ఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో మందగించిన డిమాండ్ను, క్షీణించిన ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేలా కేంద్ర ప్రభుత్వం వివిధ దశల్లో ఎన్నో చర్యలు చేపడుతోంది. కరోనా ప్రారంభంలో రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీ, ఎంఎస్ఎంఈలు, చిన్నవ్యాపారులకు ఊరట, ఉద్యోగులకి వివిధ ప్రయోజనాలు కల్పించడంతో పాటు ఇటీవల ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులకు ఎల్టీసీ వోచర్ సౌకర్యాన్ని కల్పించింది. దీని ద్వారా ఉద్యోగులకు ప్రయోజనం కల్పించడంతో పాటు ఇది డిమాండ్ పుంజుకునేందుకు ప్రోత్సహించే చర్య. తాజాగా కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది. దీపావళి పండుగకు ముందే ప్యాకేజీ ప్రకటించనుందని ఇది వరకే వార్తలు వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం ఆమోదం
దేశంలోని పది రంగాల్లో దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు రూ.2 లక్షల కోట్ల ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలు (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్-PLI) ప్రకటించింది కేంద్రం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా రూ.2 లక్షల కోట్ల విలువైన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాలకు బుధవారం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ నేడు మీడియా సమావేశంలో తెలిపారు.
ఈ రంగాలకు ప్రోత్సాహకం
1) అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్(ACC) బ్యాటరీ, 2) ఎలక్ట్రానిక్/టెక్నాలజీ ప్రోడక్ట్స్, 3) ఆటోమొబైల్స్ & ఆటో కాంపోనెంట్స్, 4) ఫార్మాస్యూటికల్స్ డ్రగ్స్ 5) టెలికం & నెట్వర్కింగ్ ఉత్పత్తులు, 6) టెక్స్టైల్ ఉత్పత్తులు: MMF సెగ్మెంట్ అండ్ టెక్నికల్ టెక్స్టైల్స్, 7) ఆహార ఉత్పత్తులు, 8) హై-ఎఫిషియెన్సీ సోలార్ పీవీ మోడ్యూల్స్ 9) వైట్ గూడ్స్ (ACs & LED), 10) స్పెషాలిటీ స్టీల్ ఉన్నాయి. పబ్లిక్ ప్రయివేటు భాగస్వామ్య పథకాలకు మరింత ఊతమిస్తామని, వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కింద రూ.8100 కోట్లు కేంద్రం కేటాయించినట్లు జవదేకర్ తెలిపారు. దేశీ తయారీ రంగాన్ని అంతర్జాతీయస్ధాయిలో దీటుగా మలిచేందుకు చర్యలు చేపడతామని, తయారీ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తామన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ దిశగా..
ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్ భారత్ వైపు దేశాన్ని నడిపిస్తామన్నారు. భారత దేశ పరిశ్రమను విదేశాలకు ధీటుగా, నిలపడంతో పాటు పారిశ్రామిక వస్తువుల ఉత్పత్తిని, ఎగుమతులను పెంచడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోంది. ఉత్పాదక రంగాన్ని ప్రోత్సహించడం, అనుకూలమైన ఉత్పాదక వాతావరణాన్ని సృష్టించడం, ప్రపంచ సరఫరా గొలుసుతో అనుసంధానం చేస్తున్నట్లు జవదేకర్ తెలిపారు. ఎంఎస్ఎంఈలకు అండగా ఉండే నిర్ణయాలు తీసుకుంటోంది. కేంద్రం నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థలో వృద్ధికి, భారీ ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని జవదేకర్ అన్నారు.