పేపర్ లెస్..హల్వా లెస్: పార్లమెంట్లో మరో రెండు కీలక సెషన్స్ లెస్
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సమీపిస్తోన్నాయి. ఇంకో రోజు మాత్రమే ఉంది. సోమవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. అనంతరం ఎకనమిక్ సర్వేను టేబుల్ చేస్తారు. ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ సభలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెడతారు. ఉదయం 11 గంటలకు ఆమె 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రసంగాన్ని ఆరంభిస్తారు.
జీరో అవర్, క్వశ్చన్ అవర్ రద్దు..
తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం.. రెండోరోజు బడ్జెట్ ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకుని కీలకమైన రెండు సెషన్స్ను పార్లమెంట్ సెక్రెటేరియట్ రద్దు చేసింది. అవే- జీరో అవర్, క్వశ్చన్ అవర్. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రెండు రోజుల్లో ఈ రెండు సెషన్లను నిర్వహించట్లేదని వెల్లడించింది. ఈ మేరకు ఓ బులెటిన్ విడుదల చేసింది. జనవరి 31, ఫిబ్రవరి 1 అంటే - సోమ, మంగళవారాల్లో రాజ్యసభ, లోక్సభల్లో జీరో అవర్, క్వశ్చన్ అవర్ ఉండబోవని స్పష్టం చేసింది.
ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా..
ఫిబ్రవరి 2వ తేదీ బుధవారం నుంచి ఈ రెండు సెషన్లను పునరుద్ధరిస్తామని సెక్రెటేరియట్ పేర్కొంది. తమ తమ నియోజకవర్గాలకు సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావించదలిచిన సభ్యులకు ఆన్లైన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించింది. ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇ-పోర్టల్ ద్వారా గానీ లేదా పార్లమెంటరీ నోటీస్ ఆఫీస్లో వ్యక్తిగతంగా గానీ- తాము ప్రస్తావించదలిచిన అంశాల గురించిన సమాచారాన్ని తెలియజేయవచ్చని సూచించింది.
పార్లమెంట్ సంప్రదాయం..
పార్లమెంట్ రూల్స్, ప్రొసీజర్ల ప్రకారం.. సమావేశాలను నిర్వహించిన ప్రతీసారీ.. ప్రతీరోజు జీరో అవర్, క్వశ్చన్ అవర్ కోసం 60 నిమిషాలను కేటాయించాల్సి ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు లోక్సభలో తొలుత క్వశ్చన్ అవర్ మొదలవుతుంది. ఆ తరువాత జీరో అవర్ను షెడ్యూల్ చేస్తుంది సెక్రెటేరియట్. ఇది పార్లమెంట్ ఆనవాయితీ. రాజ్యసభలో తొలుత జీరో అవర్ ఆరంభమౌతుంది. దాని తరువాత క్వశ్చన్ అవర్ను నిర్వహిస్తారు.
పేపర్ లెస్..
ఈ సంవత్సరం కూడా పేపర్లెస్ బడ్జెట్ ప్రతిపాదనల తెరమీదికి రానున్నాయి. గత సంవత్సరం నిర్మల సీతారామన్..పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సంప్రదాయానికి భిన్నంగా బహీ ఖాతాను సమర్పించారామె. దీనికోసం ప్రత్యేకంగా ఓ యాప్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ పేరుతో రూపొందించిన ఈ యాప్లో బడ్జెట్ ప్రతిపాదనలన్నింటినీ ఉంచారు.
హల్వాలెస్..
ఈ సారి కూడా అదే తరహాలో పేపర్లెస్ బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టనున్నారు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ బడ్జెట్ కాపీలను యాప్లో అందుబాటులో ఉంచుతామని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫామ్స్పై స్మార్ట్ఫోన్లను వినియోగించే వారు ఈ యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది హల్వా లెస్ బడ్జెట్. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి హల్వా సంప్రదాయానికి కేంద్ర ప్రభుత్వం బ్రేక్ వేసింది. దానికి బదులుగా స్వీట్లను పంచి పెట్టింది.