పెట్రోల్పై రూ.2.50, డీజిల్పై రూ.4 సెస్: అదనంగా భారం ఉండదంటోన్న నిర్మలమ్మ: ఎలాగంటే?
న్యూఢిల్లీ: ఇప్పటికే వాహనదారుల వీపు విమానం మోత మోగిస్తోన్న పెట్రల్, డీజిల్పై కేంద్ర ప్రభుత్వం అదనంగా సెస్ను ప్రవేశపెట్టబోతోంది. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజు అంటే.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి రాబోతోంది. కొత్తగా విధించిన సెస్ వల్ల పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే అవకాశం లేదని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వ్యవసాయ మౌలిక, అభివృద్ధి కోసమే కొత్తగా సెస్ను ప్రవేశపెట్టామని తెలిపారు. కొత్తగా విధించిన సెస్ ప్రకారం.. పెట్రోల్పై లీటర్ ఒక్కింటికి రూ.2.50 పైసలు, డీజిల్పై నాలుగు రూపాయల భారం పడుతుంది.
కొత్తగా ప్రవేశపెట్టబోయే సెస్ను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం అమల్లో ఉన్నరెండు రకాల సెస్ను రద్దు చేయబోతోన్నామని ఆమె తెలిపారు. ఫలితంగా వాహనదారులపై అదనంగా ఎలాంటి భారం పడబోదనే హామీ ఇచ్చారు. ప్రస్తుతం పెట్రోల్పై 1.40 పైసలు, డీజిల్పై 1.80 పైసల మేర బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ అమల్లో ఉంది. స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఈ స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ పెట్రోల్పై 11 రూపాయలు, డీజిల్పై ఎనిమిది రూపాయలుగా ఉంటోంది.
వాటన్నింటినీ ఎత్తేయబోతోన్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వాటి స్థానంలో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ను విధించినట్లు తెలిపారు. ఈ కొత్త సెస్ ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. కొత్త సెస్ను ప్రవేశపెట్టినప్పటికీ.. పాత డ్యూటీలను తొలగించడం వల్ల అదనపు భారం ఉండబోదని ఆమె భరోసా ఇచ్చారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. రాజస్థాన్లో పెట్రోల్ రేటు 100 రూపాయల మార్క్ను కూడా దాటేసింది. ఈ పరిణామాల మధ్య కొత్తగా ఏవైనా ఉపశమనాన్ని కేంద్రం బడ్జెట్లో ప్రకటిస్తుందని వాహనదారులు ఆశించారు.
దానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా సెస్ను విధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అదే సమయంలో రెండు రకాల ఎక్సైజ్ సుంకాలను ఎత్తేయడం ఊరట కలిగించే అంశమేనని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొత్త సెస్ వచ్చిన తరువాత పెట్రోల్, డీజిల్ రేట్లు మరింత పెరిగే అవకాశం లేకపోలేదనీ అంటున్నారు. దాని ప్రభావం ఎలా ఉంటుందనేది తెలియడానికి మరో రెండు నెలల పాటు ఎదురు చూడాల్సి ఉంటుంది.