28 దేశాలకు త్వరలో విమాన సర్వీసులు పునరుద్ధరణ: బంగ్లాదేశ్తో బిగిన్
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్తో అనేక దేశాలు విమాన సంబంధాలను తెంచుకున్నాయి. కరోనా వల్ల సంభవించిన సంక్షోభ పరిస్థితులు సమసిపోయేంత వరకూ ఒక్క విమానాన్ని కూడా నడిపించడానికి ముందుకు రావట్లేదు. వాయు మార్గాలను మూసివేశాయి. జర్మనీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కెనడా వంటి పలు దేశాలు భారత్కు విమాన సర్వీసులను నిలిపివేశాయి.
అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించే విషయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పష్టంగా ఉంది. దేశం సరిహద్దులను దాటుకుని వెళ్లే కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులను ఈ నెల చివరి వరకూ పొడిగించింది. ఈ మేరకు కిందటి నెల 30వ తేదీన ఓ ప్రకటన జారీ చేసింది. ఆగస్టు 31వ తేదీ వరకు కమర్షియల్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులు అందుబాటులో ఉండబోవని స్పష్టం చేసినట్టయింది.
భారత విమాన ప్రయాణికులపై ట్రావెల్ బ్యాన్ను కొనసాగిస్తోనన దేశాలు సానుకూలంగా స్పందించకపోవడం వల్లే డీజీసీఏ అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని కొనసాగిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పరిస్థితులు ప్రారంభమైన తొలి రోజుల్లో విధించిన నిషేధాన్ని కెనడా మళ్లీ పొడిగించింది. మరో నెలరోజుల పాటు నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 21వ తేదీ వరకు నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు ఓ ప్రకటన జారీ చేసింది.
నిజానికి- కెనడా విధించిన ట్రావెల్ బ్యాన్ ఈ నెల 21వ తేదీన ముగియాల్సి ఉండగా.. దాన్ని సెప్టెంబర్ 21వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు కెనడా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన వెలువడించింది. ఈ నిషేధం కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులకు మాత్రమే వర్తింప జేసింది. కార్గో సర్వీసులకు మినహాయింపును ఇచ్చింది. అవి యధాతథంగా రాకపోకలు సాగిస్తాయి. ఈ పరిస్థితుల మధ్య భారత్- బంగ్లాదేశ్కు విమాన సర్వీసులను పునరుద్ధరించింది
Rashmi gautham: మోడరన్ డ్రెస్ లోనే కాదు, చీరలో కూడా అందాలు ఆరబోస్తున్న జబర్దస్త్ బ్యూటీ (ఫొటోస్)
ఎయిరిండియాతో పాటు స్పైస్జెట్, ఇండిగో ఎయిర్లైన్స్ బంగ్లాదేశ్కు విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చాయి కూడా. కాగా ఎయిర్ బబుల్ సెక్యూర్ వ్యవస్థ మధ్య ఈ సర్వీసుల పునరుద్ధరణకు నోచుకున్నాయి. ఇదే ఎయిర్ బబుల్ వ్యవస్థను భారత్.. మొత్తంగా 28 దేశాలతో ఏర్పరచుకుంది. బంగ్లాదేశ్తో పాటు ఆప్ఘనిస్తాన్, బహ్రెయిన్, భూటాన్, కెనడా, ఇథియోపియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాక్, జపాన్, కెన్యా, కువైట్, మాల్దీవులు, నేపాల్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, ఖతర్, రష్యా, రువాండ, సెషెల్స్, శ్రీలంక, టాంజానియా, ఉక్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఉజ్బెకిస్తాన్, అమెరికాతో భారత్ ఎయిర్ బబుల్ సెక్యూర్ను ఏర్పాటు చేసుకుంది. ఫలితంగా ఆయా దేశాలకు త్వరలోనే విమాన సర్వీసులను పునరుద్ధరించే అవకాశాలు లేకపోలేదు. బంగ్లాదేశ్కు ఫ్లయిట్ సర్వీసులను పునరుద్ధరించడాన్ని దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.