మరో ఏడాది రాకెట్ స్పీడ్లో దేశ ఆర్థిక వ్యవస్థ.. 'బ్రైట్ స్పాట్' అంటూ ఐక్యరాజ్యసమితి కితాబు
India Economy: ప్రపంచంలోని వివిధ దేశాలతో పోలిస్తే ఆర్థిక వ్యవస్థ పరంగా 2023కి గాను ఇండియా ఓ బ్రైట్ స్పాట్ అని ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటాయి. మరోసారి 2024లో భారత వృద్ధిపై అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి సైతం ఇదే తరహా కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
2024 క్యాలెండర్ సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.7 శాతం వృద్ధి చెందుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. స్థిరమైన దేశీయ డిమాండ్ ఇందుకు తోడ్పడుతున్నట్లు పేర్కొంది. అధిక వడ్డీ రేట్లు, బలహీన బాహ్య డిమాండ్ వెరసి ఈ ఏడాది పెట్టుబడులు మరియు ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని అభిప్రాయపడింది. ఈ మేరకు 'వరల్డ్ ఎకనామిక్ సిట్యుయేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2023 - మిడ్ ఇయర్' పేరిట నివేదిక విడుదల చేసింది.
దక్షిణాసియాలో అతిపెద్దదైన భారత ఆర్థిక వ్యవస్థ.. 2023లో 5.8 శాతం, 2024లో 6.7 శాతం వృద్ధి చెందవచ్చని వెల్లడించింది. మితమైన గ్లోబల్ కమోడిటీ ధరలు, నెమ్మదైన కరెన్సీ విలువలో తరుగుదల కలిసి దిగుమతి ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుండటంతో.. 2023లో ఇండియా ద్రవ్యోల్బణం 5.5 శాతానికి పడిపోతుందని లెక్క గట్టింది. ఈ ఏడాది ఆరంభంలో పేర్కొన్న GDP వృద్ధి 5.8 శాతాన్నే మరోసారి ఖరారు చేసింది.
ఇతర దక్షిణాసియా దేశాల్లో వృద్ధి అవకాశాలు సవాలుగా ఉన్నప్పటికీ భారత ఆర్థికం బలంగా ఉంటుందని UN భావిస్తున్నట్లు చెప్పింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని యుఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ చీఫ్ హమీద్ రషీద్ వెల్లడించారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా 'బ్రైట్ స్పాట్' అని కీర్తించారు. దక్షిణాసియా సగటు 11 శాతం కాగా భారత ద్రవ్యోల్బణం దాదాపు 5.5 శాతం మాత్రమే ఉన్నట్లు గుర్తుచేశారు.