అల్ట్రాటెక్ సిమెంట్స్ గుడ్న్యూస్: రూ.వేల కోట్లతో: ఏపీకీ బెనిఫిట్
ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదాని సారథ్యంలోని అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలు సిమెంట్ ఉత్పాదక రంగంలో భారీ పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో- రంగంలో పోటీ తీవ్రమైంది. దీన్ని ఎదుర్కొనడానికి అల్ట్రాటెక్ సిమెంట్స్ సన్నాహాలు చేపట్టింది. స్విట్జర్లాండ్కు చెందిన హోల్సిమ్ వాటాలను ఇటీవలే అదాని గ్రూప్స్ కొనుగోలు చేసింది. అంబుజా సిమెంట్స్లో హోల్సిమ్కు 63.19, ఏసీసీలో 4.48 శాతం వాటాలు ఉండేవి. వాటిని 10.5 బిలియన్ డాలర్లతో గౌతమ్ అదాని సొంతం చేసుకున్నారు.
అదాని ఎంట్రీతో పోటీ..
81,361 కోట్ల రూపాయలను అంబుజా సిమెంట్స్, ఏసీసీల్లో ఇన్వెస్ట్ చేశారు. అలాగే- నాన్ ప్రమోటర్ షేర్ హోల్డర్స్గా 26 శాతాన్ని కొనుగోలు చేయడానికి ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చింది. దీనికి సంబంధించిన ఒప్పందాలు ఇదివరకే కుదుర్చుకుంది. హోల్సిమ్ వాటాలను కొనుగోలు చేసిన అనంతరం అదాని గ్రూప్స్ ఓ సరికొత్త రికార్డును నెలకొల్పినట్టయింది. సిమెంట్ ఉత్పాదక రంగంలో దేశంలోనే రెండో అతిపెద్ద ఇండస్ట్రీగా ఆవిర్భవించింది.
ఆధిపత్యం అల్ట్రాటెక్దే..
ప్రస్తుతం అల్ట్రాటెక్ సిమెంట్-111.4 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. ఏసీసీ అండ్ అంబుజా సిమెంట్స్-70 మిలియన్ టన్నులతో రెండో స్థానంలోకి వచ్చింది. శ్రీసిమెంట్-43.4, నువొకొ విస్టాస్ కార్పొరేషన్-22.3, రామ్కో సిమెంట్స్-19.4, ఇండియా సిమెంట్స్-15.6, బిర్లా సిమెంట్స్-15.4, జేకే సిమెంట్స్ 13.9, జేకే లక్ష్మీ సిమెంట్స్-13.9, ఓరియంట్ సిమెంట్స్ 8.5 మిలియన్ టన్నులను ప్రొడ్యూస్ చేస్తోన్నాయి.
అల్ట్రాటెక్ విస్తరణ..
ఈ సెగ్మెంట్పై తనకు ఉన్న ఆధిపత్యాన్ని కొనసాగించడానికి అల్ట్రాటెక్ సిమెంట్స్ యాజమాన్యం విస్తరణ పనులకు పూనుకుంది. కుమారమంగళం బిర్లా సారథ్యంలోని ఆదిత్య బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఇదీ ఒకటి. వేల కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా తన సిమెంట్ ప్లాంట్లను విస్తరించనుంది. వాటి ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచనుంది. సంవత్సరానికి 22.6 మిలియన్ టన్నుల మేర సిమెంట్ను ఉత్పత్తి చేసేలా తన ప్లాంటన్నింటి సామర్థ్యాన్ని పెంచనున్నట్లు తెలిపింది.
రూ.12,886 కోట్లతో..
దీనికోసం 12,886 కోట్ల రూపాయలను వ్యయం చేయనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం అల్ట్రాటెక్ సిమెంట్స్ వార్షిక ఉత్పాదక సామర్థ్యం 119.95 ఎంపీటీఏగా ఉంటోంది. వచ్చేరెండేళ్ల కాలంలో 22.6 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది. ఈ మేరకు రెగ్యులేటరీకి ప్రతిపాదనలను సమర్పించింది. ప్రస్తుతం ఏపీ సహా వేర్వేరు రాష్ట్రాల్లో అల్ట్రాటెక్ సిమెంట్స్కు 22 ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, 27 గ్రైండింగ్స్ యూనిట్స్, ఒక క్లింకరైజేషన్, ఎనిమిది బల్క్ ప్యాకేజింగ్ టర్మినల్స్ ఉన్నాయి.
ఏపీ ప్లాంట్..
తాజాగా వాటన్నింటి సామర్థ్యాన్ని పెంచడానికి 12,886 కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంగీకరించినట్లు అల్ట్రాటెక్ సిమెంట్స్ యాజమాన్యం తెలిపింది. కాగా- అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని బుగ్గ వద్ద అల్ట్రాటెక్ సిమెంట్స్కు ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ ఉంది. తాజాగా సంస్థ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయంతో ఈ ప్లాంట్ ఉత్పాదక సామర్థ్యం పెరగనుంది. కనీసం 500 కోట్ల రూపాయలను విస్తరణ కోసం వ్యయం చేసే అవకాశం ఉంది.