300 ఏళ్లలోనే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై భారీ దెబ్బ, భారతసంతతి భుజస్కందాలపై భారం!
కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. అమెరికా, చైనా, బ్రిటన్, భారత్ సహా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ పతనం కానుంది. అంతర్జాతీయ.. ఆయా దేశాల వృద్ధి రేటు మైనస్లలోకి వెళ్తోంది. కొన్ని దేశాల ఎకానమీ అయితే దశాబ్దాలు, శతాబ్దాల వెనక్కి వెళ్లనుంది. బ్రిటన్ ఎకానమీ భారీగా దెబ్బతింటుందని అంచనా వేస్తున్నారు.
ఆశ్చర్యం: అతి తక్కువ దెబ్బ చైనాకు, కరోనా కేసులు తక్కువైనా ఇండియాకే భారీ దెబ్బ
13 శాతం కుంగనున్న బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలోని వివిధ దేశాలు లాక్ డౌన్ ప్రకటించడం లేదా ప్రజా జీవనం స్తంభింప చేసే చర్యలు తీసుకున్నాయి. బ్రిటన్ ప్రభుత్వం కూడా షట్ డౌన్ విధించింది. దీంతో 2020 క్యాలెండర్ ఇయర్లో ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఏకంగా 13 శాతం మేర కుంగిపోతుందని అంచనా వేస్తున్నారు.
300 ఏళ్లలో అత్యంత దారుణమైన సంక్షోభం
కరోనా కారణంగా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై ఏకంగా 300 సంవత్సరాలలో మొదటిసారి ఇంత ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఈ దేశానికి ఈ మూడు శతాబ్దాలలో ఇదే అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంగా నిలువనుంది.
ఏడాది తర్వాత సర్దుకోవచ్చు
ఏప్రిల్ - జూన్ నెల మధ్య ఎకనమిక్ ఔట్ పుట్ 35 శాతం మేరకు పడిపోవచ్చునని అంచనాలు ఉన్నాయి. నిరుద్యోగిత రేటు రెండింతలకు పెరిగి 10 శాతానికి చేరుకోవచ్చునని చెబుతున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలోని షట్ డౌన్ లేదా ఆంక్షలు ఎత్తివేసిన ఏడాది తర్వాత కాస్త సర్దుకుంటుందని భావిస్తున్నారు.
20 లక్షల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం
కరోనా మహమ్మారి కారణంగా బ్రిటన్ వ్యాప్తంగా 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందని ఫైనాన్స్ మినిస్టర్ రిషి సునక్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా ప్రభావం తీవ్రంగానే ఉందని, మన ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడనుందని ఆయన ప్రభుత్వ సమావేశంలో అన్నారు.
సాధారణ స్థితికి ఆరు నెలలు
షట్ డౌన్ నేపథ్యంలో వ్యాపారాలు ఎంతకాలం క్లోజ్ అవుతాయో చెప్పలేని పరిస్థితిలు ఉన్నాయని, మూడు నెలల పాటు ఈ ప్రభావం ఉండవచ్చునని, ఆ తర్వాత క్రమంగా ఎత్తివేయడానికి మరో మూడు నెలలు పట్టవచ్చునని అంటున్నారు. మొత్తంగా సాధారణ స్థితికి రావడానికే ఆరు నెలలు పట్టువచ్చునని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బడ్జెట్ లోటు ఐదు రెట్లు ఎక్కువ
2020, 2021లలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ భారీగా కుంగిపోనుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనా వేసింది. ఈ సంవత్సరం బడ్జెట్ లోటు 273 బిలియన్ పౌండ్స్ (342 బిలియన్ డాలర్లు)గా ఉండవచ్చునని చెబుతున్నారు. ఇది గత అంచనా కంటే ఐదు రెట్లు ఎక్కువ. ఇది జీడీపీలో 14 శాతానికి సమానం.
లోటు భర్తీ ఇలా..
2007లో ప్రారంభమైన ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత 10 శాతానికి పైగా చేరుకుంది. అయితే క్రమంగా ఈ లోటును 2 శాతానికి తగ్గించుకుంది. ప్రధానంగా వివిధ పబ్లిక్ సేవలకు ఖర్చులు తగ్గించడం ద్వారా లోటును భర్తీ చేసింది. కాగా, ప్రస్తుతం బ్రిటన్ ఆర్థిక మంత్రిగా భారత సంతతి రిషి సునక్ ఉన్నారు. బ్రిటన్ ఎకానమీపై 300 ఏళ్లలో తొలిసారి ఇంత ప్రభావం పడుతుందంటే ప్రభుత్వానికి అతి పెద్ద సవాలే.
త్వరగా రికవరీ అవుతుందని రిషి సునక్
కరోనా తర్వాత బ్రిటన్ ఎకానమీ త్వరగా రికవరీ అవుతుందని రిషి సునక్ ధీమా వ్యక్తం చేశారు. లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ 30 శాతం మేర నష్టపోనుందని చెప్పారు. కరోనా కారణంగా ఏప్రిల్ 14 వరకు యూకేలో 12,107 మంది చనిపోగా, 93,873 మందికి వ్యాధి సోకింది.