దివాళాపై సమయమిద్దాం: విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో మరోసారి ఊరట
ఇండియన్ బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి లండన్లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు యూకే కోర్టులో ఊరట లభించింది. మాల్యాను దివాళా తీసిన వ్యక్తిగా ప్రకటించడం ద్వారా తమకు చెల్లించాల్సిన రూ.9వేల కోట్లను రాబట్టుకునే వీలు కల్పించాలని SBI నేతృత్వంలోని ఇండియన్ బ్యాంకుల కన్సార్టియం లండన్ కోర్టును అభ్యర్థించింది. దీనిపై వాదనలు విన్న లండన్ కోర్టు.. మాల్యాకు ఊరటను ఇచ్చే తీర్పు చెప్పింది.
అంచనాలు తలకిందులయ్యాయి, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది: ఆర్బీఐ
మాల్యాకు కాస్త సమయం ఇవ్వాలి
భారత సుప్రీం కోర్టు, కర్ణాటక హైకోర్టులో పెండింగులో ఉన్న పలు పిటిషన్లను పరిగణలోకి తీసుకొని బ్యాంకులకు తిరిగి చెల్లించేందుకు విజయ్ మాల్యాకు కాస్త సమయం ఇవ్వాలని లండన్ కోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో మాల్యాపై తక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా బ్యాంకులకు ఎలాంటి ప్రయోజనం లేదా లాభం ఉండబోదని తెలిపింది.
వాయిదా వేస్తే తిరిగి చెల్లించే అవకాశం
భారత్లో పలు కేసులు విచారణలో ఉన్న సమయంలో బ్యాంకులు కోరుతున్నట్లుగా దివాళాగా ప్రకటించడం అసాధారణమని తెలిపింది. కొంతకాలం పాటు దీనిని వాయిదా వేయడం వల్ల సదరు వ్యక్తి బ్యాంకులకు తిరిగి చెల్లించే అవకాశం ఉంటుందని జస్టిస్ మైఖేల్ బ్రిగ్స్ తన తీర్పులో తెలిపారు. దీనిపై గత ఏడాది డిసెంబర్ నెలలో యూకే కోర్టు వాదనలు విన్నది. తాజాగా గురువారం తీర్పు చెప్పింది.
కరోనా ప్రభావం
ఈ దివాలా పిటిషన్ అసాధారణమైనదని, భారత్లో విస్తృతమైన చర్యలకు ఆస్కారం ఉన్న సమయంలో బ్యాంకులు దివాళా ఉత్తర్వుల కోసం ఒత్తిడి చేస్తున్నాయని తీర్పులో జడ్జి పేర్కొన్నారు. విచారణను 1 జూన్ 2020 తర్వాత చేపట్టేందుకు పార్టీలు అంగీకరించాయని, కరోనా మహమ్మారి కారణంగా తేదీని నిర్ణయించడం ఇబ్బందికరంగా మారిందని జడ్జి తెలిపారు.
గతంలో...
గతంలో విచారణ నిమిత్తం భారత్కు మాల్యాను అప్పగించే విషయమై సానుకూలంగా కోర్టు తీర్పు చెప్పింది. దీనిని పైకోర్టులో సవాల్ చేసేందుకు మాల్యాకు యూకే కోర్టు అవకాశం కల్పించింది. ఇండియన్ బ్యాంకులకు రూ.9వేల కోట్లకు పైగా మోసం చేయడంతో పాటు మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నరు మాల్యా.