లక్ష్మీ విలాస్ బ్యాంకు కేసులో ట్విస్ట్, గతంలోనే డీబీఎస్... ఇప్పుడు ఉచితంగా దక్కించుకుంటోంది!
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన లక్ష్మీ విలాస్ బ్యాంకు(LVB) వచ్చే నెల నాటికి డీబీఎస్(ఇండియా విభాగం)లో విలీనం కానుంది. దీనికి ఆర్బీఐ కూడా పచ్చజెండా ఊపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే గతంలో ఈ రెండు బ్యాంకులకు సంబంధించిన డీల్ను ఆర్బీఐ తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఓ ప్రమోటర్ వెల్లడించారు. రెండేళ్ల క్రితం 2018లో 50 శాతం వాటా కోసం డీబీఎస్ ప్రయత్నాలు చేయగా కేంద్ర బ్యాంకు అంగీకరించలేదు.
ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి.. అదానీ రోజు సంపాదన రూ.449 కోట్లు: ప్రపంచ కుబేరుల్లో 40వ స్థానం
2018లో 50 శాతం వాటా కొనుగోలుకు..
LVBలో 50 శాతం వాటా కొనుగోలుకు సింగపూర్కు చెందిన డీబీఎస్ బ్యాంకు 2018లోనే భారీ మొత్తంతో ముందుకు వచ్చిందని LVB ప్రమోటర్ కేఆర్ ప్రదీప్ వెల్లడించారు. కానీ ఆ ఆఫర్ను ఆర్బీఐ తిరస్కరించిందన్నారు. LVB వాటాదారులు, ప్రమోటర్లకు ఆర్బీఐ న్యాయం చేస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. LVBలో ప్రదీప్కు 4.8 శాతం వాటా ఉంది. బ్యాంకు ప్రమోటర్ల వాటాల్లో ఇదే అత్యధికం. ఆ సమయంలో LVB వ్యాల్యూ రూ.3500 కోట్ల నుండి రూ.5,000 కోట్ల మధ్య లెక్కగట్టారు.
2018లో ఏం జరిగిందంటే
'2018లో మూలధనసమీకరణ ప్రణాళికల్లో భాగంగా ఇన్వెస్టర్ల అన్వేషణ కోసం LVB జేపీ మోర్గాన్ను నియమించుకుంది. జేపీ మోర్గాన్ పలువురు ఇన్వెస్టర్లను తీసుకు వచ్చింది. ఇన్వెస్టర్లు షేరు ఒక్కింటికి రూ.100-రూ.155 శ్రేణిలో ఆఫర్లు వచ్చాయి. షేరుకు రూ.100 చొప్పున కనీసం 50 శాతం వాటా తీసుకునేందుకు అప్పుడు డీపీఎస్ బ్యాంకు ముందుకు వచ్చింది. ఇందుకోసం జేపీ మోర్గాన్తో చర్చలు జరిపింది. డీబీఎస్ బ్యాంకు... LVBపై నియంత్రణాధికారాలు కోరింది. గ్లోబల్ బ్యాలెన్స్ షీట్లో ఏకీకృతం చేయాలని భావించింది. ఆ తర్వాత జేపీ మోర్గాన్, డీబీఎస్ ఆర్బీఐ వద్దకు చర్చల కోసం వెళ్లాయి. LVBలో 50 శాతం వాటాను డీబీఎస్ కోరింది. అంతకంటే తక్కువ కోసం ఆసక్తి చూపలేదు. అయితే డీబీఎస్ తన వాటా కోసం ప్రయివేటు బ్యాంకు నిబంధనలు పాటించాలని ఆర్బీఐకి తెలిపింది. ఈ ఆర్బీఐ నిబంధనలతో వెనక్కి తగ్గింది' అని చెప్పారు.
భారీ వ్యాల్యుయేషన్ గ్యాప్
అప్పుడే ఆర్బీఐ పచ్చజెండా ఊపితే డీబీఎస్ షేరుకు రూ.100 ఇచ్చేదని, ఇప్పుడు పూర్తిగా ఉచితంగా తీసుకున్నట్లు అవుతుందని ప్రదీప్ చెప్పారు. భారీ వ్యాల్యుయేషన్ గ్యాప్ ఉందన్నారు. తాను డీబీఎస్ ప్రతినిధులను కలవలేదని, జేపీ మోర్గాన్ మధ్యవర్తిగా వ్యవహరించిందని తెలిపారు.