లాక్డౌన్.. ఆటోమొబైల్ డీలర్ల పీక మీద కత్తే! ఆ వాహనాల సంగతేంటి?
కరోనా వైరస్.. ఇంట్లో ఉన్నా భయమే, బయటికి వెళ్లాలన్నా భయమే. ఇది ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రజలు అనుభవిస్తున్న విచిత్రమైన పరిస్థితి. కేవలం నిత్యావసరాల కోసం తప్ప జనం రోడ్డెక్కడం లేదు. ప్రభుత్వాలు అనుమతించినవి తప్ప మిగిలిన అన్ని దుకాణాలు మూతపడే ఉన్నాయి. ఆటోమొబైల్ షోరూమ్లూ మూతబడ్డాయి.
మరోవైపు భారత్ స్టేజ్-4 వాహనాల రిజిస్ట్రేషన్కు ఈ నెలాఖరు మాత్రమే గడువు. దీంతో ఈ వాహనాలను వదిలించుకునేందుకు వీటిని తయారు చేసిన కంపెనీలు కూడా ప్రయత్నిస్తున్నాయి. డీలర్లకు భారీగా డిస్కౌంట్లు ఆఫర్ చేశాయి. డీలర్లు కూడా ఈ తగ్గింపును కొనుగోలుదారులకు బదిలీ చేశారు. దీంతో మొన్నటి వరకు వాహనాల బుకింగ్ కాస్త పర్వాలేదనిపించింది.
ఇంతలోనే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం దేశమంతటా 'లాక్డౌన్' పరిస్థితి విధించింది. దీంతో ఇది వరకే ఆయా వాహనాలు బుక్ చేసుకున్న వారు సైతం ఇళ్లలోంచి బయటికి రాలేని పరిస్థితి. కరోనా వైరస్ నేపథ్యంలో ఆటోమొబైల్ షోరూంలకు వచ్చే కస్టమర్లు బాగా తగ్గిపోయారు. దీంతో బీఎస్-4 వాహనాల విషయంలో డీలర్లు పెద్ద అయోమయంలో పడిపోయారు.
పీక మీద కత్తిలా మారిన ‘లాక్డౌన్’...
కేంద్రం ప్రకటించిన లాక్డౌన్ ఆటోమొబైల్ డీలర్లను హతాశులను చేసింది. 21 రోజుల లాక్డౌన్తో దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు, నగరాలలో ప్రజలెవరూ బయటికి రావడం లేదు. లాక్డౌన్ కారణంగా ప్రజలెవరూ తమ ఇళ్లలోంచి బయటికి కదలని పరిస్థితి. మరోవైపు ఈ నెలాఖరుతో బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్కు కేంద్రం విధించిన డెడ్లైన్ కూడా ముగిసిపోతుంది.
డిస్కౌంట్ల బాటలో బైక్ కంపెనీలు...
గత ఏడాది పండుగ సీజన్లో ఆఫర్ చేసిన 4-8 శాతం డిస్కౌంట్ ఆఫర్ కంటే ఎక్కువగా 11-15 శాతం డిస్కౌంట్లను ఇప్పుడు బైక్ కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. హీరో మోటోకార్ప్ తన బెస్ట్ సెల్లింగ్ మోడళ్లపై రూ.5 వేల వరకు డిస్కౌంట్లను పెంచింది. స్కూటర్స్, ప్రీమియం బైక్స్పై అత్యధికంగా రూ.10 వేలు, రూ.12,500 తగ్గింపు ధరను ఆఫర్ చేస్తోంది. ఇక పుణేకు చెందిన బజాజ్ ఆటో అయితే తన బీఎస్4 వెర్షన్లను వదిలించుకునేందుకు కొన్ని మోటార్ సైకిళ్లపై రూ.5 వేల క్యాష్ డిస్కౌంట్ ఇస్తోంది. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కూడా తన కస్టమర్లకు రూ.23 వేల వరకు ఆదా చేస్తోంది. క్యాష్ డిస్కౌంట్ల రూపంలో రూ.10 వేలు, ఐసీఐసీఐ కార్డులుపై కొనుగోలు చేసిన వారికి క్యాష్ బ్యాక్ ఇస్తోంది.
ఏప్రిల్ 1 నుంచి వాటికి ‘నో రిజిస్ట్రేషన్’...
కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి బీఎస్-4 వాహనాలకు ఏ రాష్ట్రంలోనూ రిజిస్ట్రేషన్ జరగదు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా ‘లాక్డౌన్' పరిస్థితి నెలకొనడంతో కేవలం నిత్యావసరాల కొనుగోలుకు మాత్రమే ప్రజలు బయటికి వస్తున్నారు. ఎవరూ.. ఏ వాహనమూ కొనే ‘మూడ్'లో లేరు. ఒకవేళ డిస్కౌంట్లకు ఆశపడి కొందామనుకున్నా.. అన్ని రాష్ట్రాల్లోనూ వాహనాల షోరూమ్లు క్లోజ్.
డీలర్స్ బాడీ ‘ఫాడా’ ఆందోళన...
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆటోమొబైల్ డీలర్ల సంఘం ‘ఫాడా' ఆందోళన వ్యక్తం చేసింది. బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్కు ఈ నెలాఖరు వరకు సమయం ఉన్నప్పటికీ ప్రస్తుతం ‘లాక్డౌన్' కారణంగా వాహన విక్రయాలు జరగవు. దీనివల్ల దేశ వ్యాప్తంగా బీఎస్-4 తరగతికి చెందిన 12 వేలకుపైగా ప్యాసింజర్ వెహికల్స్, 8 వేలకుపైగా కమర్షియల్ వెహికల్స్, 7 లక్షలకుపైగా ద్విచక్ర వాహనాలు ఆయా డీలర్ల వద్దే మిగిలిపోతాయి. ఇప్పటికే ఆయా వాహనాలను బుకింగ్ చేసుకున్న వారు కూడా ప్రభుత్వాలు ‘లాక్డౌన్' ప్రకటించిన నేపథ్యంలో వాటికి డెలివరీ కూడా తీసుకోలేని పరిస్థితి నెలకొంది.
రిజిస్ట్రేషన్ గడువు పొడిగించాలి, లేదంటే...
ఈ నేపథ్యంలో బీఎస్-4 వాహనాలకు సంబంధించి గతంలో కేంద్రం ప్రకటించిన గడువును మే నెలాఖరు వరకు పొడిగించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్(ఫాడా) కోరుతోంది. ఇది దేశంలోని 26 వేల వాహన డీలర్షిప్లకు ప్రాతినిధ్య వహిస్తోంది. అంతేకాదు, ‘ఫాడా' ఇటీవల ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించి పిటీషన్ కూడా వేసింది. ఈ పిటీషన్ ఈనెల 27న విచారణకు రానుంది. ఒకవేళ సుప్రీంకోర్టు తమ పిటిషన్ను విచారణకు పరిగణించకపోతే.. డీలర్ల వద్ద ఉన్న బీఎస్-4 వాహనాల స్టాక్ను ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్(ఓఈఎం)లకు తిప్పి పంపించడం తప్ప డీలర్లకు గత్యంతరం లేదని ‘ఫాడా' పేర్కొంటోంది.