మోడీకి మెజార్టీ ఉంది కానీ, మీ పాలనలోనే ఎక్కువ పనిచేశా: నిర్మలకు రఘురాం రాజన్
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ రంగ దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమని, మన్మోహన్ సింగ్, రఘురాం రాజన్ హయాంలోనే బ్యాంకులు ఈ స్థితికి దిగజారాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై ఆర్బీఐ మాజీ గవర్నర్ అయిన రఘురాం రాజన్ స్పందించారు. ఆర్బీఐ గవర్నర్గా తన పదవీ కాలంలో మూడింట రెండు వంతులు బీజేపీ ప్రభుత్వం ఉండగానే చేశానని గుర్తు చేశారు.
ఫోన్ చేస్తే రుణాలు, రఘురాం రాజన్ టైంలోనే అత్యంత వరస్ట్: నిర్మలా సీతారామన్
బీజేపీ హయాంలో 26 నెలలు
తాను కాంగ్రెస్ హయాంలో ఏడాది కూడా ఆర్బీఐ గవర్నర్గా పని చేయలేదని, బీజేపీ హయాంలో రెండేళ్లకు పైగా చేశానని రఘురాం రాజన్ అన్నారు. 2013 సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 2016 సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఆయన ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. 2014 మే నెలలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీనిని గుర్తు చేస్తూ తాను కాంగ్రెస్ హయాంలో 8 నెలలు, బీజేపీ హయాంలో 26 నెలలు పని చేశానన్నారు. నిర్మల చేసిన వ్యాఖ్యలపై తాను రాజకీయ చర్చకు తావివ్వనని స్పష్టం చేశారు.
నేను రాకముందే గుట్టలుగా నిరర్థక ఆస్తులు
2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుంచే దేశీయంగా సమస్యలకు మూలాలు ఏర్పడ్డాయని రఘురాం రాజన్ చెప్పారు. అంతకుముందు పెట్టిన పెట్టుబడులు నిరర్థక ఆస్తులుగా మారాయని చెప్పారు. తాను బాధ్యతలు చేపట్టేసరికే ఇలా గుట్టలుగా పేరుకున్న నిరర్థక ఆస్తులతో బ్యాంకు పద్దులు స్తంభించాయని చెప్పారు. తన పదవీ కాలంలో వాటిని క్లీన్ చేయడం ప్రారంభించానన్నారు. ఈ బాధ్యత పూర్తవకుండానే తన పదవీ కాలం ముగిసిందని, ఇప్పటికీ పూర్తిగా జరగలేదన్నారు.
నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల్లో వాస్తవం...!
రాజన్ వ్యాఖ్యలను బట్టి సమస్యకు మూలం మోడీ ప్రభుత్వం ముందు నుంచే ఉందన్న నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు నిజం అయ్యాయని భావించవచ్చు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. అప్పటి నుంచే దేశీయంగా సమస్యలు ఏర్పట్టాయని, తాను బాధ్యతలు చేపట్టే సమయానికే బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు గుట్టలుగా పెరిగాయని చెప్పారు. కాబట్టి ఈ పాపం యూపీఏదే అన్న నిర్మల వ్యాఖ్యల్లో కొంత వాస్తవం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
బ్యాంకింగ్ రంగం.. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక ఇబ్బందులకు కారణం రాజన్, గత యూపీఏ ప్రభుత్వమేనని నిర్మల ఇటీవల ఆరోపించారు. బ్యాంకింగ్ రంగంపై రాజన్ పర్యవేక్షణ సరిగాలేదని, నాటి ప్రధాని మన్మోహన్ హయాంలో ఫోన్లపై కార్పొరేట్లకు బ్యాంకర్లు రుణాలు ఇస్తూ పోయారని, దీంతో మొండి బకాయిలు లేదా ఎన్పీఏలు పేరుకుపోయాయని నిర్మల అన్నారు. ఇప్పుడు రాజన్ కూడా యూపీఏ హయాంలోనే గుట్టలుగా పేరుకుపోయాయని చెబుతున్నారు. తద్వారా ఎన్పీఏల పాపం కాంగ్రెస్దే అని ఆయన మాటలు చెప్పకనే చెబుతున్నాయని అంటున్నారు.
సంస్కరణల విషయంలో సాహసోపేతంగా ముందుకెళ్లాలి
రఘురాం రాజన్ ఇంకా మాట్లాడుతూ... బ్యాంకుల ఎన్పీఏలను ప్రక్షాళన చేసే పనిని మొదలు పెట్టానని, అయితే తన తర్వాత వచ్చినవారి ఆధ్వర్యంలో ఇది అంతగా ప్రభావవంతంగా జరుగలేదన్నారు. భారత వృద్ధి రేటు పెరిగితేనే ఉద్యోగాలు పెరుగుతాయని రాజన్ అన్నారు. ప్రతి నెలా 10 లక్షల మంది యువత ఉద్యోగార్థులుగా మారుతున్నారన్నారు. ఇలాంటి సమయంలో ఈ 5% జీడీపీ ఉపయోగపడదన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరును ప్రతిబింబించే వృద్ధిరేటు ఆకర్షణీయంగా ఉండాలన్నారు. సంస్కరణల విషయంలో వెనుకడుగు వేయరాదని సూచించారు. సాహసోపేత సంస్కరణలతో ముందుకెళ్లాలన్నారు.
మోడీకి మెజార్టీ ఉంది కానీ..
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి స్పష్టమైన మెజార్టీ ఉండటం శుభపరిణామం అని రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో సంస్కరణల విషయంలో వెనుకబడటం దురదృష్టకరమన్నారు. దేశానికి ఇప్పుడు కొత్త తరం సంస్కరణల అవసరం ఉందన్నారు. మందగించిన వృద్ధి రేటును తిరిగి పరుగు పెట్టించాలన్నారు. 5 శాతం వృద్ధి రేటు అంటే తీవ్ర ఆర్థిక మందగమనానికి సంకేతం అన్నారు.
ఇది ఆందోళన కలిగించే అంశం
2016లో ఓ త్రైమాసికంలో జీడీపీ 9% నమోదయిందని రఘురాం రాజన్ గుర్తు చేశారు. ఇప్పుడు 5% పడిపోవడం ఆందోళన చెందే అంశమన్నారు. బ్యాంకులకు మూలధన అవసరాలను కేంద్రం తీర్చడాన్ని సమర్థించిన ఆయన, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల అవసరాలు కూడా తీర్చాలని అభిప్రాయపడ్డారు. మొండి బకాయిల తీవ్రత తగ్గించాలన్నారు. మొండి బకాయిల అంశాన్ని తాను పూర్తిగా చేయలేకపోయానని, దీనిని పూర్తి చేయాల్సి ఉందన్నారు.