ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లిన వేళ..సీఈఓ పరాగ్ అగ్రవాల్ సంచలనం
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం, టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్.. ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం ముగిసింది. ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ఎక్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేతికి వెళ్లింది. ట్విట్టర్ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. ఇప్పుడాయన ట్విట్టర్కూ కొత్త అధిపతి అయ్యారు. దీనికోసం ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్ విలువ 44 బిలియన్ డాలర్లు.
ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్స్పై..
ఇప్పుడున్న ట్విట్టర్ యాజమాన్యానికి ఎలాన్ మస్క్ చెల్లించాల్సిన మొత్తం ఇది. మూడు నెలల వ్యవధిలో ఈ బదలాయింపు ప్రక్రియ పూర్తవుతుంది. ట్విట్టర్ ప్లాట్ఫామ్ బదలాయింపు ప్రక్రియ కొనసాగుతున్న ప్రస్తుత దశలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరాగ్ అగ్రవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్స్పై వేటు వేశారు. వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇకపై ఆ ఇద్దరితో సంస్థకు ఎలాంటి సంబంధం ఉండబోదని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఉద్యోగులందరికీ మెయిల్స్ పంపించారు.
నియామకాలపై పునఃసమీక్ష..
కొత్త నియామకాలను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు పరాగ్ అగ్రవాల్. దీనితోపాటు- ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న ఉద్యోగాల నియామకాలను కూడా పునఃసమీక్షించనున్నామని పేర్కొన్నారు. కొంతమందిని తొలగించే అవకాశాలు కూడా లేకపోలేదని ఈ ఇమెయిల్స్ సందేశంలో స్పష్టం చేశారు. ట్విట్టర్ యాజమాన్యం చేతులు మారిన వేళ.. సోషల్ మీడియాను శాసిస్తోన్న బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్పై చోటు సంభవిస్తోన్న ఈ పరిణామాలు ఉత్కంఠతకు గురి చేస్తోన్నాయి.
ఆ ఇద్దరూ వీరే..
తాజాగా కన్జ్యూమర్ డివిజన్ అధిపతి కెవాన్ బేక్పూర్, రెవెన్యూ విభాగం చీఫ్ బ్రూస్ ఫాల్క్పై పరాగ్ అగ్రవాల్ వేటు వేశారు. వారిని విధుల నుంచి తొలగించారు. ఈ విషయాన్ని వారిద్దరూ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా తెలియజేశారు. కంపెనీ నుంచి వైదొలగాలనేది తమ నిర్ణయం కాదని స్పష్టం చేశారు. తాను వైదొలగాలంటూ పరాగ్ అగ్రవాల్ కోరాడని, దానికి అంగీకరించానని అన్నారు. తాను నాయకత్వాన్ని వహిస్తోన్న విభాగాన్ని కొత్త పుంతలు తొక్కించాలనే ఉద్దేశంతో పరాగ్ ఈ సూచన చేసినట్లు చెప్పారు.
టార్గెట్ను ఛేదించాలనుకున్న దశలో..
తనను సంస్థ నుంచి ఫైర్ చేసినట్లు రెవెన్యూ విభాగాధిపతి బ్రూస్ ఫాల్క్ కూడా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ట్విట్ థ్రెడ్స్లో తన బయోడేటాను అన్ ఎంప్లాయిడ్గా అప్డేట్ చేశారు. రెవెన్యూపరంగా సంస్థ పెట్టుకున్న టార్గెట్ను ఛేదించగలమని, త్రైమాసికాలకు సంబంధించిన ఆదాయం అబద్ధం చెప్పదని అన్నారు. ఈ దశలో తనను యాజమాన్యం తొలగించిందని పేర్కొన్నారు.
7.5 బిలియన్ డాలర్ల రెవెన్యూ టార్గెట్గా పెట్టుకున్నా..
కాగా- కెవాన్ బేక్పూర్ ఏడు సంవత్సరాల కిందట ట్విట్టర్లో జాయిన్ అయ్యారు. అంచెలంచెలుగా ఎదిగారు. కన్జ్యూమర్ డివిజన్కు చీఫ్గా అపాయింట్ అయ్యారు. 2023 చివరి నాటికి 7.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించాలని ట్విట్టర్ లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో రోజువారీ వినియోగదారుల సంఖ్యను 315 మిలియన్లకు చేర్చాలనేది కంపెనీ టార్గెట్. ఎర్నింగ్ రిపోర్ట్స్ అందిన తరువాత ఈ రెండు టార్గెట్లను కూడా ట్విట్టర్ టాప్ మేనేజ్మెంట్ వెనక్కి తీసుకుంది.