ఆ కీలక ఉద్యోగి తొలగింత, గూగుల్లో అలజడి: ఇద్దరు టెక్కీల రాజీనామా
ప్రముఖ సెర్చింజన్ గూగుల్లో ఇద్దరు ఇంజినీర్ల రాజీనామా కలకలం రేపుతోంది. దీంతో గూగుల్లో వైవిధ్యం, నైతిక విలువలపై కొనసాగుతోన్న వివాదాలు తారాస్థాయికి చేరాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రీసెర్చర్ టిమ్నిట్ గెబ్రూపై గూగుల్ వేటు వేసింది. దీంతో ఇద్దరు టెక్కీలు సంస్థకు గుడ్బై చెప్పారు. రాజీనామా చేసిన వారిలో యూజర్ భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించే డేవిడ్ బకర్, సాఫ్టువేర్ ఇంజినీర్ వినీష్ కన్నన్ ఉన్నారు. గూగుల్ను వీడుతున్నట్లు వీరు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
గూగుల్ నుండి ఆ కీలక ఉద్యోగి ఔట్, సుందర్ పిచాయ్ క్షమాపణ!
గత నెలలో బకర్
యూజర్ భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించే డేవిడ్ బకర్ గత నెలలో గూగుల్ను విడిచి పెట్టారు. ఆయనకు ఈ సంస్థతో 16 సంవత్సరాల అనుబంధం ఉంది. గెబ్రూ వెళ్లిపోవడం గూగ్లర్గా కొనసాగాలనే తన కోరికకు చెక్ పెట్టిందని బకర్ అన్నారు. వైవిధ్యంపై గూగుల్ దృష్టి సారిస్తున్నప్పటికీ సంస్థ లోపల ఎన్నో గళాలను వినిపించకుండా పోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పుడు వినేష్
మరో సాఫ్టువేర్ ఇంజినీర్ వినేష్ కన్నన్ సంస్థను వీడినట్లు బుధవారం తెలిపారు. తాను మంగళవారం రాజీనామా చేసినట్లు చెప్పారు. గెబ్రూ పట్ల గూగుల్ సరిగ్గా వ్యవహరించలేదని, అలాగే రిక్రూటర్ ఏప్రిల్ క్రిస్టియానా క్యూర్లీ పట్ల కూడా సరిగ్గా వ్యవహరించలేదని పేర్కొన్నారు. గత ఏడాది వీరిని అకారణంగా తొలగించారన్నారు. కాగా, క్యూర్లీ, గెబ్రూ ఇద్దరు కూడా బ్లాక్స్.
గెబ్రూ తొలగింత.. గతంలో పిచాయ్ స్పందన
కాగా, ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) స్కాలర్ టిమ్నిట్ గెబ్రూ గూగుల్ పబ్లిక్ ఇమేజ్ను మెరుగుకావడానికి ఎంతో దోహదపడ్డారు. అదే సమయంలో AI టెక్నాలజీలోని సమస్యలను ప్రశ్నించాడు. ఆ తర్వాత గెబ్రూ ఆ సంస్థ నుండి నిష్క్రమించారు. ఇది చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా గత ఏడాది డిసెంబర్లో స్పందించారు. గెబ్రూ అకస్మికంగా బయటకు వెళ్లడం అనేక సందేహాలకు తావిచ్చిందన్నారు. దీనిపై స్పందించిన పిచాయ్ గెబ్రూ నిష్క్రమణకు దారితీసిన పరిస్థితుల గురించి గూగుల్ సమీక్షిస్తుందన్నారు. గెబ్రూను తొలగించారు. దీనిని గూగుల్ రాజీనామాగా పేర్కొంది. గెబ్రూ తొలగింతపై క్షమాపణలు చెప్పిన సుందర్ పిచాయ్, ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినట్లు అప్పుడు చెప్పారు. 'గెబ్రూ తొలగింత తన దృష్టికి వచ్చింద'ని పిచాయ్ అన్నారు. 'ఈ తొలగింత ఎన్నో అనుమానాలకు తావిచ్చింది. మరింత మంది ఉద్యోగులు ప్రశ్నించేందుకు తావిచ్చింది. దీని పట్ల నేను క్షమాపణ చెబుతున్నాను. మీ నమ్మకాన్ని పునరుద్ధరించే బాధ్యతను తీసుకుంటున్నాన'ని సుందర్ పిచాయ్ అన్నారు.