Twitter: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి బిగ్ షాక్: వ్యక్తిగత అకౌంట్ నుంచి..!
న్యూఢిల్లీ: కొంతకాలంగా దేశంలో వివాదాలకు కేంద్రబిందువు అవుతూ వస్తోన్న టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్.. మరోమారు అదే తరహా వైఖరిని ప్రదర్శించింది. ఈ వివాదాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని నిరూపించుకున్నట్టయింది. ఇదివరకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అకౌంట్ను మొత్తానికే బ్లాక్ చేసి పారేసిన ట్విట్టర్.. అదే తరహా దూకుడును భారత్లో ప్రదర్శిస్తోంది. ఖాతాలను వినియోగిస్తోన్న వారు హోదాలతో సంబంధం లేకుండా.. బ్లూ బ్యాడ్జి వెరిఫికేషన్ విషయంలో నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరిస్తామనే విషయాన్ని ట్విట్టర్ యాజమాన్యం చెప్పకనే చెప్పినట్టయింది.
రెండు అకౌంట్లు..
తాజాగా- ఉప రాష్ట్రపతి ముప్పవరకు వెంకయ్య నాయుడు వినియోగిస్తోన్న ఆయన వ్యక్తిగత అకౌంట్కు సంబంధించిన బ్లూ టిక్ను తొలగించింది. ఉప రాష్ట్రపతి హోదాలో ఆయన వాడుతోన్న అకౌంట్ బ్లూ బ్యాడ్జిని కొనసాగించింది. వెంకయ్య నాయుడు రెండు రకాల ట్విట్టర్ అకౌంట్లను వినియోగిస్తోన్నారు. ఒకటి- ఉప రాష్ట్రపతి హోదాలో.. మరొకటి వ్యక్తిగతంగా. ఈ రెండింట్లో @MVenkaiahNaidu అనే ఖాతా ఆయన వ్యక్తిగతానికి సంబంధించినది.
ఏడాది కిందట చివరి పోస్ట్..
ఏదైనా ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన సమయంలో వాటికి సంబంధించిన సమాచారాన్ని, ఫొటోలను వెంకయ్యనాయుడు ఈ ఖాతాలో పోస్ట్ చేస్తుంటారు. గత ఏడాది జులై 23వ తేదీన ఇందులో ఆయన చివరి పోస్ట్ చేశారు. ఆ తరువాత అప్డేట్స్ ఏవీ అందులో కనిపించలేదు. బ్లూ టిక్ ఉన్న అకౌంట్.. సదరు ఖాతాదారుడికి సంబంధించినదేనని ధృవీకరించడానికి ట్విట్టర్ యాజమాన్యం ఈ బ్లూ టిక్ను వినియోగిస్తుంటుంది. బ్లూ టిక్ ఉన్న అకౌంట్లో పోస్ట్ అయ్యే సమాచారం- విశ్వసించదగ్గదిగా భావిస్తుంటారు నెటిజన్లు.
బ్లూ టిక్ వెరిఫికేషన్..
అలాంటి ప్రాధాన్యత ఉన్న ఈ మార్క్ను తొలగించింది ట్విట్టర్ యాజమాన్యం. ఉప రాష్ట్రపతి స్థాయి నాయకుడే అయినప్పటికీ.. ఆ విషయాన్ని పట్టించుకోలేదు. తన వ్యక్తిగత అకౌంట్లో వెంకయ్య నాయుడు యాక్టివ్గా లేకపోవడం వల్లే బ్లూ బ్యాడ్జిని తొలగించి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. అదే సమయంలో ఉప రాష్ట్రపతి హోదాలో ఆయన వినియోగించే అధికారిక ఖాతాకు బ్లూ టిక్ను కొనసాగించింది. ప్రభుత్వరంగ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా హౌస్లు, జర్నలిస్టులు, ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన సెలెబ్రిటీలు, క్రీడాకారులు.. ఇలా గుర్తింపు పొందిన సెక్టార్లలోని ప్రముఖుల అకౌంట్లను ట్విట్టర్ యాజమాన్యం ప్రస్తుతం వెరిఫై చేస్తోంది.
యాక్టివ్గా లేకపోయినా..
ఈ క్రమంలో బ్లూ టిక్ ఉన్న ఖాతాదారులు తమ ట్విటర్ అకౌంట్లో యాక్టివ్గా లేకపోతే మాత్రం.. ఆ బ్యాడ్జ్ను తొలగించేస్తోంది. ఈ విషయంలో ఎవరినీ మినహాయించట్లేదు. దాదాపు ఏడాది కాలంగా ఎలాంటి పోస్టులు లేకపోవడం వల్లే ట్విట్టర్ యాజమాన్యం వెంకయ్య నాయుడి వ్యక్తిగత అకౌంట్కు సంబంధించిన బ్లూ బ్యాడ్జిని తొలగించి ఉండొచ్చని అంటున్నారు. కాగా- ట్విట్టర్ చర్య పట్ల భారతీయ జనతాపార్టీ నాయకుడు, ముంబై విభాగం అధికార ప్రతినిధి సురేష్ నకువా అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు. ఉప రాష్ట్రపతి స్థాయి నాయకుడి అకౌంట్ బ్లూ టిక్ తొలగించడం సమంజసం కాదని చెబుతున్నారు.
తప్పు తెలుసుకున్న ట్విట్టర్..
వెంకయ్య నాయుడి వ్యక్తిగత అకౌంట్కు సంబంధించిన బ్లూ టిక్ తొలగింపుపై ట్విట్టర్ యాజమాన్యం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. దేశవ్యాప్తంగా దుమారం చెలరేగడంతో నాలిక్కరచుకుంది. దాన్ని పునరుద్ధరించింది. గత ఏడాది జులై నుంచి ఈ అకౌంట్ యాక్టివ్గా లేకపోవడం వల్లే బ్లూటిక్ను తొలగించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. సుదీర్ఘకాలం పాటు యాక్టివ్గా లేని ఖాతాలకు చెందిన బ్లూ బ్యాడ్జిని తొలగించాలనేది తమ సంస్థ మార్గదర్శకాల్లో ఉన్నాయని, దానికి లోబడే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. దాన్ని వెంటనే పునరుద్ధరించినట్లు స్పష్టం చేసింది.