52 వారాల గరిష్టం నుండి 25% పడిపోయిన ట్విట్టర్ స్టాక్స్
సోషల్ మీడియా నెట్వర్కింగ్ ట్విట్టర్-భారత ప్రభుత్వం మధ్య కొత్త ఐటీ రూల్స్కు సంబంధించి విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విట్టర్ స్టాక్స్ నిన్న భారీగా పడిపోయాయి. ట్విట్టర్కు కేంద్రం సమన్లు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం స్టాక్స్ పైన పడింది. ట్విట్టర్ స్టాక్ బుధవారం 0.50 శాతం క్షీణించి 59.93 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 0.43 బిలియన్ డాలర్లు తగ్గి 47.64 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంతకుముందు సెషన్లో మార్కెట్ క్యాప్ 48.07 బిలియన్లుగా ఉంది.
నేడు ట్విట్టర్ స్టాక్ 59.93 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఫిబ్రవరి 26వ తేదీన 52 వారాల గరిష్టం 80.75 డాలర్లకు చేరుకుంది. కానీ ఇప్పుడు 60 డాలర్ల స్థాయికి వచ్చింది. నేడు మాత్రం ట్విట్టర్ స్టాక్స్ కాస్త పుంజుకొని, 0.76 శాతం ఎగిసి 60.71 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
ఫిబ్రవరి 26వ తేదీ నుండి ట్విట్టర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పటి వరకు 22.54 శాతం లేదా 13.87 బిలియన్ డాలర్లు పడిపోయింది. అంతకుముందు ఏడాది నవంబర్ 13వ తేదీన ట్విట్టర్కు ప్రభుత్వం నోటీసులు పంపించడంతో అప్పుడు ఈ స్టాక్స్ 43.48 డాలర్లకు పడిపోయింది.
ఇదిలా ఉండగా, ట్విట్టర్కు, కేంద్రానికి మధ్య ఐటీ నిబంధనలపై వివాదం నడుస్తోంది. ఈ అంశంపై ఐటీ శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ స్పందించారు. కొత్త ఐటీ చట్టం అమలుకు ట్విట్టర్కు తగిన సమయం ఇచ్చామన్నారు. మూడు నెలల సమయమిచ్చినా ట్విట్టర్ స్పందించలేదన్నారు. ఇతర సంస్థలు ఐటీ చట్టాన్ని పాటిస్తున్నాయని, ట్విట్టర్కు ఉన్న అభ్యంతరమేమిటన్నారు.