Twitter: మధ్యాహ్న భోజనానికి రూ.32,000.. మళ్లీ 4,400 మందిని తొలగించిన మస్క్..
Twitter: ఇటీవల ట్విట్టర్ టేకోవర్ తర్వాత కంపెనీ ఉద్యోగుల్లో దాదాపు 50 శాతం మందిని తొలగిస్తూ ఎలాన్ మస్క్ సంచలనం సృష్టించారు. దీనిని ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రపంచం మరిచిపోక ముందే మరోసారి ఉద్యోగుల లేఆఫ్ ప్రకటించారు. ఇప్పటికే హఠాత్తుగా ఉద్యోగాలను కోల్పోయిన అనేకమంది కన్నీటి గాథలు మరువక ముందే మరో బాంబు పేల్చారు.
భారీ నష్టాలు..
అడ్వర్టైజర్లు ప్రకటనలు ఇవ్వటం నిలిపివేయటంతో కంపెనీకి రోజూ కోట్లలో నష్టం వస్తోందని అందుకే ఉద్యోగుల తొలగింపు తప్పటం లేదని ట్విట్టర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ వెల్లడించారు. ఈ క్రమంలో కంపెనీ దివాళా ప్రమాదం అంచున ఉందని తెలిపారు. అయితే తాజాగా కంపెనీ కోసం పనిచేస్తున్న 4400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగుల తొలగింపులతో ట్విట్టర్ పనితీరు సైతం అధ్వాన్నంగా మారుతోందని చాలా మంది అంటున్నారు.
భోజనాల ఖర్చు..
ఇప్పటి వరకు ట్విట్టర్ ఉద్యోగులకు భోజనం ఉచితంగా అందించబడింది. 12 నెలల కాలానికి ఉద్యోగుల భోజనానికి 400 మిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. అంటే ఒక్కో ఉద్యోగికి రోజుకు దాదాపు రూ.32,000 కంపెనీ ఖర్చు చేస్తోందని మస్క్ పేర్కొన్నారు. శాన్ ఫ్రాన్సిస్కో ట్విట్టర్ హెడ్ క్వార్టర్స్ లో తక్కువ మంది ఉద్యోగులకు ఎక్కువ విలువైన భోజనం అందించడం గురించి ట్విట్టర్ బాస్ హైలైట్ చేశారు.
మండిపడ్డ మాజీ ఉద్యోగి..
భోజనాల ఖర్చు విషయంలో కొత్త యజమాని ఎలాన్ మస్క్ అబద్ధాలు చెబుతున్నారని మాజీ ట్విట్టర్ ఉద్యోగి ట్రేసీ హాకిన్స్ మండిపడ్డారు. ఎలాన్ మస్క్ నేతృత్వంలో పనిచేయటం తమకు ఇష్టం లేకనే తాను ఉద్యోగానికి రాజీనామా చేశానని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రోగ్రామ్ ను తాను పర్యవేక్షించానని ఉద్యోగికి రోజుకు ఆహారం అందించటానికి సగటున 20-25 డాలర్లను మాత్రమే ఖర్చుచేసినట్లు ఆమె ఎలాన్ మస్క్ ట్వీట్ కు బదులిచ్చింది.
ఆఫీసులకు రాని ఉద్యోగులు..
కార్యాలయాలకు హాజరవుతున్న సగటు ఉద్యోగుల సంఖ్య 20-50 శాతంగా ఉందని మాజీ ఉద్యోగిని హాకిన్స్ తెలిపారు. అయితే రికార్డుల ప్రకారం గరిష్ఠంగా 25 శాతం, సగటున కేవలం 10 శాతం మంది ఉద్యోగులు మాత్రమే హాజరయ్యారని ఎలాన్ సమస్క్ ఆమెకు బదులిచ్చారు. అయితే ఎలాన్ మస్క్ వచ్చిన తర్వాత ఉద్యోగులకు రిమోట్ వర్క్ పాలసీకి శాశ్వత ముగింపు పలికారు. దీనికి తోడు వారానికి 40 గంటలు పనిచేయాల్సిందేనని ఉద్యోగులకు చెప్పారు.