Twitter: కేంద్రం చెప్పినట్టు వింటున్నాం: ఢిల్లీ హైకోర్టుకు రిపోర్ట్
న్యూఢిల్లీ: కొంతకాలంగా దేశంలో వివాదాలకు కేంద్రబిందువు అవుతూ వస్తోన్న టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్..తన వైఖరిని మార్చుకుంది.. మెట్టు దిగింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు లోబడి పనిచేయడానికి అంగీకరించింది. ఈ దిశగా కసరత్తు కూడా మొదలు పెట్టింది. ఇందులో భాగంగా గ్రీవెన్స్ అధికారి నియామకానికి సంబంధించిన చర్యలను పూర్తి చేస్తోన్నామని తెలిపింది. ఈ ప్రక్రియ తుదిదశలో ఉన్నట్లు ట్విట్టర్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు ఓ నివేదికను అందజేసింది.
వావ్..భారత్లో కాయిన్బేస్ ఆఫీస్: భారీగా జాబ్స్: క్రిప్టోకరెన్సీ సెక్టార్లో
దేశంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని మార్గదర్శకాలను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ మార్గదర్శకాలన్నీ కిందటి నెల 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. వాట్సప్, ఫేస్బుక్ వాటిని అనుసరిస్తోన్నాయి. కొత్త మార్గదర్శకాలకు లోబడి కార్యకలాపాలను కొనసాగిస్తామని ప్రకటించాయి. ట్విట్టర్ మాత్రం విభేదించింది. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ రూపొందించిన కొత్త మార్గదర్శకాలను అనుసరించడానికి మొండికేసింది. యధాతథంగా తన కార్యకలాపాలను దేశంలో కొనసాగిస్తోంది.
ఈ నేపథ్యంలో- కొత్త మార్గదర్శకాలను అనుసరించడంపై ఆ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ యాజమాన్యానికి తుది నోటీసులను జారీ చేసింది. ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 79 కింద చివరి అవకాశాన్ని ఇస్తోన్నామని కేంద్రం తెలిపింది. ఈ నిబంధనల ప్రకారం- ట్విట్టర్ యాజమాన్యం భారత్లో ఒక చీఫ్ కంప్లయన్సెస్ అధికారి, ఒక నోడల్ అధికారి, ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేకంగా మరో గ్రీవెన్స్ అధికారిని వేర్వేరుగా నియమించాల్సి ఉంటుంది.
ఉత్తర ప్రదేశ్లో ఎఫ్ఐఆర్ నమోదు కావడం, కేంద్రం తుది నోటీసులను జారీ చేయడం వంటి చర్యలతో ట్విట్టర్ దిగొచ్చింది. భారత్ వరకు గ్రీవెన్స్ రీడ్రెసల్ మెకానిజం విభాగం బాధ్యతలను స్వీకరించడానికి అవసరమైన చర్యలు చేపట్టింది. గ్రీవెన్స్ అధికారి నియామకం తుదిదశలో ఉందంటూ ఢిల్లీ హైకోర్టుకు నివేదికను అందజేసింది. తాము ఇదివరకే ఓ గ్రీవెన్స్ అధికారిని నియమించినప్పటికీ.. ఆయన కిందటి నెల 21వ తేదీన విత్ డ్రా అయ్యారని స్పష్టం చేసింది.