అవును.. పరిశీలిస్తున్నాం: టిక్టాక్ తర్వాత జాక్మా అలీబాబాపై ట్రంప్ కన్ను
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఇప్పటికే చైనీస్ షార్ట్ వీడియో యాప్ టిక్టాక్కు 90 రోజుల గడువు ఇచ్చారు. తాజాగా ఇతర చైనీస్ కంపెనీలు, యాప్స్కు షాకిచ్చే సంకేతాలు ఇచ్చారు అమెరికా అధ్యక్షులు. చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు తమకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తామని ఆయన ప్రకటించారు. చైనాకు చెందిన అలీబాబా వంటి ఇతర సంస్థలపై ఆంక్షలను పరిశీలిస్తారా అని మీడియా అడగ్గా... అవును, ఇతర అంశాలను పరిశీస్తామన్నారు.
చైనీస్ టిక్టాక్కు మరింత ఊరటనిచ్చిన డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం
జాక్మాకు చెందిన అలీబాబా కూడా..
అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో ఈ ట్రేడ్ వార్ మరింతగా ముదిరింది. ఇప్పటికే టిక్టాక్కు హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్ వియ్ చాట్, అలీబాబా వంటి దిగ్గజ సంస్థలపై దృష్టి సారించారు. ఆయన కార్యవర్గం వీటిని సమీక్షించే అవకాశం ఉందని అమెరికా పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. గతవారం అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో కూడా అలీబాబా పేరును ప్రస్తావించారు. అమెరికా టార్గెట్లో జాక్మాకు చెందిన ఈకామర్స్ దిగ్గజం కూడా ఉన్నట్లుగా భావిస్తున్నారు.
టిక్ టాక్కు గడువు పొడిగింపు
బైట్ డ్యాన్స్ సంస్థకు చెందిన టిక్టాక్ యాప్ కార్యకలాపాల్ని నిలిపివేయడమో లేదా తమ దేశ కంపెనీకి విక్రయించడమో చేయాలని చెప్పిన ట్రంప్, ఇందుకు తొలుత 45 రోజుల గడువు ఇచ్చారు. ఆ తర్వాత దీనిని 90 రోజులకు అంటే నవంబర్ 12వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం కూడా చేశారు. అమెరికా జాతీయ భద్రతను బైట్ డ్యాన్స్ ప్రమాదంలోకి నెడుతోందనేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.
పెరిగిన విబేధాలు
ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికా-చైనా మధ్య విబేధాలు మరింతగా పెరిగాయి. చైనాపై ఎప్పటికప్పుడు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. గత ఏడాది చివరలో కుదిరిన ఒప్పందంలో భాగంగా సోయాబీన్స్, కార్న్ వంటి ఉత్పత్తులను కొనుగోలు చేయడాన్ని ప్రశంసించారు. గత ఏడాది చివరలో, ఈ ఏడాది ప్రారంభంలో అగ్ర ఆర్థిక దేశాల మధ్య చర్చలు కొంత సానుకూలంగా కనిపించాయి. అంతలోనే కరోనా మహమ్మారి విబేధాలు పెరగడానికి కారణంగా మారింది.