OYO: ఉద్యోగుల తొలగింపు ప్రకటించిన ఓయో.. దురదృష్టకరమన్న సీఈవో..
OYO Layoff: దేశంలో కొంత విరామం తర్వాత మళ్లీ స్టార్టప్ కంపెనీల్లో ఉద్యోగుల కోత మెుదలైంది. నిన్న షేర్ చాట్ ఈరోజు ఓయోలు ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయం తీసుకున్నాయి. ట్రావెల్ టెక్ సంస్థ ఏకాగం 10 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించిన తరుణంలో ఈ ప్రకటన వెలువడింది.
నియామకాలు..
ట్రావెల్ టెక్ సంస్థ OYO తన 3,700 ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం టెక్నాలజీ, కార్పొరేట్ వర్టికల్స్లోని ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. ఈ క్రమంలో దాదాపు 600 ఉపాధి కోల్పోనున్నారు. ఇదే సమయంలో కంపెనీ 250 మందిని కొత్తగా నియమించుకోవాలని నిర్ణయించింది. అయితే వీరిలో ఎక్కువశాతం మందిని రిలేషన్ షిప్ మేనేజ్మెంట్, బిజినెస్ డెవలప్ మెంట్ టీమ్లో జాయిన్ అవుతారని కంపెనీ చెబుతోంది. సంస్థాగత నిర్మాణంలో విస్తృతమైన మార్పులను అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
విలీన ప్రణాళిక..
మెరుగైన సామర్థ్యం కోసం కంపెనీ ప్రొడక్షన్ అండ్ ఇంజనీరింగ్ బృందాలను విలీనం చేస్తున్నట్లు కూడా పేర్కొంది. యాప్-గేమింగ్, సోషల్ కంటెంట్ క్యూరేషన్, సులభతరమైన కంటెంట్ వంటి పైలట్లు, కాన్సెప్ట్ విభాగాల్లోనూ ఈ ఉద్యోగుల తగ్గింపు జరుగుతున్నట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక మందగమన సమయంలో ఈ రీస్ట్రక్చరింగ్ కంపెనీని ముందుకు తీసుకెళ్లేందుకు సహకరిస్తుందని యాజమాన్యం భావిస్తోంది.
కంపెనీ సీఈవో..
కంపెనీ తొలగించే ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు పొందేందుకు తమ వంతు సహాయం చేస్తామని కంపెనీ వ్యవస్థాపకుడు, గ్రూప్ CEO రితేష్ అగర్వాల్ అన్నారు. కంపెనీలోని ప్రతి సభ్యుడు బలమైన వ్యక్తులని ఆయన అన్నారు. కంపెనీకి విలువైన సహకారం అందించిన చాలా మంది ప్రతిభావంతులైన ఉద్యోగులను విడిచిపెట్టాల్సి రావడం దురదృష్టకరమని సీఈవో పేర్కొన్నారు. భవిష్యత్తులో అవసరమైతే తొలగించిన ఉద్యోగులను తిరిగి చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అగర్వాల్ వెల్లడించారు.