26న సార్వత్రిక సమ్మె: కార్మిక సంఘాలకు బ్యాంకింగ్ మద్దతు, డిమాండ్లు ఇవే..
కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా గురువారం (నవంబర్ 26) సమ్మె చెపట్టాలని పది కార్మిక సంఘాలు నిర్ణయించాయి. బ్యాంకింగ్, రక్షణ, రైల్వేలతో పాటు వివిధ రంగాలకు చెందిన 25 కోట్ల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. సులభతర వాణిజ్యం పేరుతో ప్రభుత్వం కార్మిక చట్టాలను పక్కన పెడుతోందని ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీతో సహా 10 కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
సమ్మెలో పాల్గొనే కార్మిక సంఘాలు
ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC), ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC), హింద్ మజ్దూర్ సభ (HMS), సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (CITU), ఆల్ ఇండియా యునైటెడ్ ట్రేడ్ యూనియన్ సెంటర్ (AIUTUC), ట్రేడ్ యూనియన్ కో-ఆర్డినేషన్ సెంటర్ (TUCC), సెల్ఫ్ ఎంప్లాయిడ్ వుమెన్స్ అసోసియేషన్ (SEWA), ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ (AICCTU), లేబర్ ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ (LPF), యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (UTUC) ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి.
ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) కూడా ఈ సమ్మెకు మద్దతివ్వడంతో పాటు పాల్గొంటామని ప్రకటించింది.
ఈ సమ్మెలో 25 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు కార్మిక సంఘాల జాయింట్ ఫోరమ్ వెల్లడించింది.
బీజేపీ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) ఈ సమ్మెలో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది.
పలు డిమాండ్లతో ఆందోళన
ప్రధానమైన 16 డిమాండ్లతో తొమ్మిది జాతీయ కార్మిక సంఘాలతో పాటు బీమా, బ్యాంకు, రక్షణ, ఫార్మా, పీఎస్యూ, కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు 26న సార్వత్రిక సమ్మెకు సిద్ధమయ్యాయి.
వివిధ సంఘాలు ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చాయి. స్కీం వర్కర్లు, డొమెస్టిక్ వర్కర్లు, కన్స్ట్రక్షన్ వర్కర్లు, బీడీ కార్మికులు, హాకర్లు, విక్రేతలు, అగ్రికల్చరల్ వర్కర్లు, గ్రామీణ ప్రాంతాల్లోని సెల్ఫ్ ఎంప్లాయిడ్ వర్కర్లు రోడ్ల మీదకు రావాలని పిలుపునిచ్చాయి.
ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు కూడా సమ్మెలో పాల్గొనాలను పలు ప్రాంతాల్లో నిర్ణయించారు. ఈ సమ్మెకు రైల్వే, రక్షణ ఉద్యోగ సమాఖ్యలు మద్దతు తెలుపుతున్నాయి.
డిమాండ్లు ఇవీ...
అన్ని ఆదాయేతర పల్లు చెల్లించే కుటుంబాలకు నెలకు రూ.7500 నగదు బదలీ, నిరుపేదలకు నెలకు 10 కిలోల ఉచిత రేషన్ వంటివి ఈ డిమాండ్లలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి 200 రోజుల MGNREGA (రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్కీం)ను మెరుగైన వేతనాలతో విస్తరించాలి. పట్టణ ప్రాంతాలకు ఉపాధి హామీ స్కీంను విస్తరించాలి. రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వ, పీఎస్యూ ఉద్యోగుల బలవంతపు రిటైర్మెంట్ పైన కఠినమైన సర్క్యులర్ను ఉపసంహరించుకోవాలి. ఎన్పీఎస్ స్కీంను రద్దు చేసి, గతంలోని పెన్షన్ స్కీంను తీసుకు రావాలి.