భారత్లో కరోనా వ్యాక్సినేషన్ ఖర్చు ఎంతంటే? ఆర్థిక వ్యవస్థపై లాక్డౌన్ లక్షల కోట్ల భారం
కరోనా నేపథ్యంలో భారత ప్రభుత్వం 130 కోట్లకు పైగా ఉన్న ప్రజల కోసం వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించింది. ప్రతిరోజు లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల రికవరీ వేగంగా పెరుగుతోంది. వివిధ రాష్ట్రాల్లో లాక్డౌన్, కరోనా కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. తొలుత ఫ్రంట్ లైన్ వారియర్స్కు, వృద్ధులకు, 45 ఏళ్లు పైబడిన వారికి, ఇప్పుడు 18 ఏళ్లు, అంతకుమించిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సినేషన్ కోసం లక్షల కోట్లు ఖర్చవుతోంది.
గుడ్న్యూస్, ఏప్రిల్ 2022 నుండి మొబైల్ వ్యాలెట్లు, ప్రీపెయిడ్ కార్డ్స్ మార్చుకోవచ్చు
రూ.3.7 లక్షల కోట్ల ఖర్చు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎకనమిక్ వింగ్ సర్వే నివేదిక ప్రకారం వ్యాక్సినేషన్, పంపిణీ కోసం రూ.3.7 లక్షల కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచనా. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యే నాటికి దాదాపు ఈ మొత్తం కావొచ్చు. మరో విషయం ఏమంటే ఇది కూడా కేవలం 20 రాష్ట్రాల ఖర్చు మాత్రమే. అత్యధిక జనాభాతో కూడిన పేద రాష్ట్రాలు తమ ప్రజలకు వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టే పరిస్థితుల్లో ఉండవని, సంపన్న రాష్ట్రాలు గ్లోబల్ మార్కెట్లో వ్యాక్సినేషన్ కోసం అధిగ ధరలను వెచ్చించవలసి వస్తోందని పేర్కొంది.
వ్యాక్సీన్కు ఖర్చు...
రాష్ట్రాలకు అవసరమైన వ్యాక్సిన్లలో 50 శాతం కేంద్రం సమకూరుస్తుందని అంచనా వేస్తూ సిక్కిం ఒక్కో వ్యాక్సిన్కు 5 డాలర్ల చొప్పున ఖర్చు చేసినా రూ.20 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని ఈ నివేదిక తెలిపింది. ఇక ఉత్తర ప్రదేశ్లో వ్యాక్సినేషన్ కోసం రూ.67,100 కోట్లు ఖర్చు చేయవలసి ఉంటుందని తెలిపింది. ప్రజలకు త్వరగా వ్యాక్సినేషన్ ఇవ్వడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సమీకరించాలని సూచించింది. అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వ్యయం ఒకేలా ఉండేలా చూడాలని పేర్కొంది.
ఆర్థిక వ్యవస్థపై దెబ్బ
కరోనా వ్యాక్సినేషన్కు రూ.3.7 లక్షల కోట్లు కావడంతో పాటు, జూన్ చివరి నాటికి కరోనా లాక్ డౌన్, ఆంక్షల వల్ల భారత ఎకానమీకి రూ.5.5 లక్షల కోట్ల మేర దెబ్బపడుతుందని ఈ నివేదిక తెలిపింది. భారత్ వద్ద 28 మిలియన్ డోసుల కరోనా వ్యాక్సీన్ ఉందని, మరో 2.14 డోసులు ఆగస్ట్-డిసెంబర్ కాలానికి వస్తాయని వెల్లడించింది. ఉత్తర ప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలు గ్లోబల్ టెండర్స్ పిలిచాయని తెలిపింది. దేశంలో 187 మిలియన్ల మందికి వ్యాక్సినేషన్ వేశారని, ప్రతి 100 మందిలో ఇది 13.8 అని తెలిపింది.