ఉద్యోగాల కోత.. అంతా తూచ్: టాప్ 5 ఐటీ కంపెనీల్లో 96,000 కొత్త ఉద్యోగాలు
దేశీయ టాప్ 5 ఐటీ కంపెనీల్లో ఆటోమేషన్ వల్ల ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని, 2022 నాటికి 30 లక్షల వరకు ఉద్యోగాల కోత ఉండవచ్చునని బ్యాంక్ ఆఫ్ అమెరికా తాజా నివేదిక తెలిపింది. అయితే ఈ వార్తలను దేశీయ ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ కొట్టి పారేసింది. లక్షలాది ఉద్యోగాలు పోతాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక అంచనా నేపథ్యంలో నాస్కాం ఈ ప్రకటనను విడుదల చేసింది.
96000 మంది నియామకం
నైపుణ్యాలు, ప్రతిభ కలిగిన వారిని నియమించుకుంటూ, నికరంగా అధిక కొలువులు ఇచ్చే రంగంగా భారత ఐటీ పరిశ్రమ నిలుస్తోందని నాస్కామ్ పేర్కొంది. FY22లో 96,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకునే ప్రణాళికలో అగ్రశ్రేణి 5 ఐటీ కంపెనీలు ఉన్నాయని తెలిపింది. అలాగే, బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక పేర్కొన్నట్లు బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్(BPO) రంగంలో 90 లక్షల మంది పని చేయడం లేదని, 14 లక్షల మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని తెలిపింది. బీపీఎం రంగంలో నికర ఉద్యోగాల సృష్టి జరుగుతోందని వెల్లడించింది.
45 లక్షల ఉద్యోగులు
టెక్నాలజీ పరిణామం, పెరుగుతున్న ఆటోమేషన్ సంప్రదాయ ఐటీ ఉద్యోగాల స్థానంలో కొత్త ఉద్యోగాల సృష్టికి దారి తీస్తోందని నాస్కాం తెలిపింది. ఐటీ పరిశ్రమ ప్రతిభ, నైపుణ్యాలు ఉన్న వారిని చేర్చుకుంటూనే ఉంటుందని, గత ఆర్థిక సంవత్సరం దాదాపు 1,38,000 మంది కొత్తవారిని నియమించుకుందని, దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 45 లక్షలకు చేరుకుందని తెలిపింది.
నైపుణ్య శిక్షణ
ఐటీ పరిశ్రమ 2.5 లక్షల మందికి డిజిటల్ నైపుణ్య శిక్షణ అందిస్తోందని, 40,000 మంది డిజిటల్ నైపుణ్య శిక్షణ పొందిన కొత్త ప్రతిభావంతులను నియమించుకుంటోందని తెలిపింది. రానున్న అయిదేళ్ల కాలంలో రూ.22.50 లక్షల కోట్ల ఆదాయ లక్ష్యంతో పరిశ్రమ సాగుతోందని తెలిపింది.