world richest: ప్రపంచంలో అత్యంత ధనవంతులు వీళ్లే.. మరి అంబానీ, అదానీల స్థానమెంతో తెలుసా ?
world richest: కరోనా ధాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. తేరుకోవడానికి పలు దేశాలు అష్టకష్టాలు పడుతున్నాయి. ఇదే సమయంలో ప్రపంచ కుబేరుల సంపద మాత్రం మరింత పెరిగినట్లు రియల్ టైమ్ బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది.
భారతీయ వ్యాపార దిగ్గజాలు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు టాప్ 10 మంది అత్యంత ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. వారి సంపద ఎంత, ప్రపంచంలో వారు ఏస్థానంలో కొనసాగుతున్నారో తెలియజేస్తూ బ్లూమ్ బర్గ్ ఓ కథనం వెలువరించింది. వారిలో టాప్ ఐదుగురి చేతిలో ఎంత సంపద ఉందో చూద్దాం..
ఎలాన్ మస్క్
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సీఈవోనే ఈ ఎలాన్ మస్క్. ఆయన సంపద 190 బిలియన్ డాలర్లుగా బ్లూమ్ బర్గ్ అంచనా వేసింది. ఆయన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు 800 బిలియన్ డాలర్లు. మస్క్ కు చెందిన రాకెట్ కంపెనీ స్పేస్ఎక్స్ విలువ దాదాపు 100 బిలియన్ డాలర్లకు చేరింది.
బెర్నార్డ్ ఆర్నాల్ట్
ఫ్రాన్స్లోని LVMH ఛైర్మన్ & CEO బెర్నార్డ్ ఆర్నాల్ట్. లూయిస్ విట్టన్, సెఫోరాతో సహా 70 విభిన్న సంస్థలతో కూడిన విస్తారమైన వ్యాపార సామ్రాజ్యం ఆయన సొంతం. భూమి మీద రెండవ అత్యంత సంపన్న వ్యక్తి. ఆయన నికర ఆస్తి విలువ 144 బిలియన్ డాలర్లు.
గౌతమ్ అదానీ
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ.. 133 మిలియన్ డాలర్లతో ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. అదానీ గ్రూప్.. భారతదేశంలోని ఓడరేవులు, విమానశ్రయాలు, ఇతర ప్రాజెక్టుల కార్యకలాపాలను నియంత్రించే అంతర్జాతీయ సంస్థ. ఇంధనం, లాజిస్టిక్స్, వ్యవసాయం, ఏరోస్పేస్ సహా ఇతర విభిన్న రంగాలలో ఆయనకు పెట్టుబడులు ఉన్నాయి.
జెఫ్ బెజోస్
జెఫ్ బెజోస్ అంటే తెలియక పోవచ్చేమో కానీ ఆయన సంస్థ అమెజాన్ అంటే తెలియని వారు దాదాపు ఉండరేమో..! సుమారు 114 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ వ్యవస్థాపకుడు & CEO జెఫ్ బెజోస్.. ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో నాల్గవ స్థానం సాధించారు. 2019లో ఆయన భార్య మెకెంజీతో విడాకుల సమయంలో కంపెనీ షేర్లు కొన్నింటిని ఆమెకు బదిలీ చేశారు. అయినా ఇప్పటికీ నాల్గవ స్థానంలో కొనసాగుతుండటం విశేషం.
బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ సృష్టికర్తే ఈ బిల్ గేట్స్. పాల్ అనెన్ తో కలిసి 1975లో ఆ సంస్థను స్థాపించారు. 107 బిలియన్ డాలర్లు నికర విలువతో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నారు. బిల్ & మిలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలకు విరివిగా విరాళాలు ఇస్తుంటారు. కంపెనీ ఈక్విటీలో కేవలం ఒక శాతాన్ని మాత్రమే ఆయన వద్ద ఉంచుకున్నారు. మిగిలిన సంపదను ఇతర ఈక్విటీలు, ఆస్తుల్లో పెట్టుబడి పెట్టారు.