సంక్షోభానికి చెల్లుచీటి.. బాక్సాఫీస్ సత్తా చాటిన సరిలేరు, అల వైకుంఠపురం, దర్బార్
దేశాన్ని ఆర్థిక మాంద్యం వెంటాడుతున్నాయనే వార్తలు ఆందోళనకరంగా ఉన్నాయి. సాధారణంగా వినియోగదారుల్లో వస్తు సేవలపై ఖర్చు చేసే సామర్థ్యం తగ్గినప్పుడు దేశవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభానికి దారి తీయడం జరుగుతుంటుంది. తెలుగు ప్రజల వినియోగ సామర్థ్యం చూస్తే ఆర్థిక మాంద్యం జాడలు ఎక్కడా కనిపించడం లేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే గత వారం రోజులుగా సంక్రాంతి పండగ వేళ వారు సినిమాలను ఆదరించిన తీరు ఆర్థిక మాంద్యం వార్తలను మరింత దూరం తరిమికొట్టాయనే వాదన మొదలైంది. ఇక తెలుగు ప్రజల ఆర్థిక వినిమయ సామర్థ్యం గురించి పూర్తి వివరాలు..
పండగొస్తే అన్ని బాధలు దూరం
దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా పండగొస్తే చాలూ తెలుగు వారు అన్ని బాధలు మరిచిపోతారు. పండగ సీజన్లో ఖర్చు చేసే సామర్థ్యం ఏంటనే విషయాన్ని పట్టించుకోకుండా వినోదానికి, సుఖ:సంతోషాలకు పెద్ద పీట వేస్తారు. తాజాగా ఆ విషయం మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు మరోసారి రుజువు చేశారు. విడుదలైన ఆన్ని సినిమాలను ఆదరించడం విశేషంగా మారింది.
సంక్రాంతి బరిలో భారీగా
సంక్రాంతి పండగంటే ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులే కాకుండా తెలుగు ప్రజల జీవితాల్లో సినిమాలు ఓ భాగమయ్యాయని చెప్పవచ్చు. అందుకే కేవలం టాలీవుడ్కే పరిమితం కాకుండా దక్షిణాది సినీ నిర్మాతలు తెలుగు ప్రేక్షకులను టార్గెట్గా చేసుకొని సినిమాలు రిలీజ్ చేస్తారు. ప్రస్తుత సంక్రాంతి సీజన్లో జనవరి 9న దర్బార్, 11న సరిలేరు నీకెవ్వరు, 12న అల వైకుంఠపురంలో, 15 తేదీన ఎంత మంచి వాడవురా రిలీజై మంచి ఆదరణను సొంతం చేసుకొంటున్నాయి.
రికార్డు కలెక్షన్లతో
సంక్రాంతి పండగ నేపథ్యంలో విడుదలైన నాలుగు సినిమాలను తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకొన్నారు. దర్బార్ చిత్రం రూ.20 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. సరిలేరు నీకెవ్వరు చిత్రం 200 కోట్ల గ్రాస్ను, అల వైకుంఠపురం రూ.150 కోట్లకుపైగా, ఎంత మంచివాడవురా సుమారు రూ.10 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేశాయి. అంటే గత వారం రోజుల్లో తెలుగు ప్రేక్షకులు సుమారు రూ.300 కోట్లను నికార్సుగా ఖర్చు చేశారనేది స్పష్టమైంది.
టిక్కెట్లే కాకుండా
ఇక టిక్కెట్ల కొనుగోలు కోసం సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేస్తే.. దానికి అనుబంధంగా ఫుడ్, ట్రావెలింగ్, ఇతర షాపింగ్ల కోసం మరింత ఖర్చు చేయడం సర్వసాధారణం. దీంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారే కాకుండా మిగితా భాషల వారు కేవలం ఈ సినిమాలపై సుమారు 350 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉందనేది ట్రేడ్ వర్గాల అంచనా. ఈ వసూళ్లను, వినియోగదారుల వ్యయ సామర్థ్యాన్ని బట్టి చూస్తే ఆర్థిక మాంద్యాన్ని తెలుగు ప్రజలు, సినిమాలు ఎలాంటి తడబాటు లేకుండా ఎదురించారనేది ఈ వారంలో స్పష్టమైందని చెప్పవచ్చు.
దుమ్మురేపిన మహేష్, అల్లు అర్జున్
సంక్రాంతి పండగ కానుకగా విడుదలైన టాలీవుడ్ చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో రూ.100 కోట్ల షేర్ (పన్నులన్నీ మినహాయించి)ను సాధించినట్టు సమాచారం. ఇక దక్షిణాదిలో సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్రం కూడా రూ.100 కోట్ల షేర్ (పన్నులన్నీ మినహాయించి)ను నమోదు చేసింది. ఈ సీజన్లో వచ్చిన ఎంత మంచివాడవురా కూడా ఆ సినిమా బడ్జెట్ రేంజ్కు మంచి వసూళ్లు రాబట్టడం తెలిసిందే.
గతేడాది ప్రతికూలతకు చెక్
గతేడాది టాలీవుడ్కు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. వేళ్ల మీద లెక్కపెట్టే హిట్లు రావడం జరిగింది. ఇలాంటి నిరాశ పరిస్థితుల్లో 2020 సంవత్సర ఆరంభం బ్లాక్బస్టర్ హిట్లతో దూసుకెళ్లున్నది. దీంతో తెలుగు, తమిళ సినిమా పరిశ్రమకు ఈ నాలుగు సినిమాలు పండగ వాతావరణాన్ని తీసుకు రావడమే కాకుండా ఇండస్ట్రీలో సంక్షోభానికి చెల్లు చీటి రాశాయనే వాదన వినిపిస్తున్నది. ఇక జనవరి నెల ఆశాజనకంగా ప్రారంభం కావడంపై పలు సినీ నిర్మాణ సంస్థలు రానున్న రోజులు, సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.