భారత ఆర్థిక వ్యవస్థపై అభిజిత్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు, కానీ..
కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ భారత ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ 2019 స్థాయి కంటే దిగువనే ఉందని వ్యాఖ్యానించారు. ప్రజల చిన్న చిన్న ఆశలు క్రమంగా ఆవిరై పోతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితికి తాను ఎవరినీ బాధ్యులుగా చేయాలని భావించడం లేదన్నారు. ఆయన గుజరాత్లోని అహ్మదాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులను ఉద్దేశించి శనివారం రాత్రి వర్చువల్ సదస్సులో మాట్లాడారు.
ఎవరినీ నిందించడం లేదు
'తనకు తెలిసి దేశం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ 2019 స్థాయి కంటే దిగువనే కనిపిస్తోంది. ఎంత దిగువన ఉందనే విషయం తెలియనప్పటికీ, ఆ దిగువకు మాత్రం ఉంది. దీనికి తాను ఎవరిని కూడా నిందించడం లేదు. కేవలం తాను ఆర్థిక పరిస్థితి గురించి మాత్రమే చెబుతున్నాను' అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కూడా పలు సూచనలు చేశారు.
విద్యార్థులకు హితబోధ
తమ గమ్యాన్ని ఎలా నిర్దేశించుకోవాలో విద్యార్థులకు సూచించారు. కుటుంబం లేదా సమాజం నుండి వచ్చే ఒత్తిళ్లకు లోనుకావొద్దని, జీవితంలో ఏం చేయాలనుకుంటే అది చేయాలని, ఆ దిశగా ధైర్యంగా ముందుకు నడవాలని సూచించారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో చదువుకునే రోజుల్లో తాను కూడా పది రోజుల పాటు తీహార్ జైలులో గడిపానని గుర్తు చేసుకున్నారు. 'నేను JNUను వీడి హార్వార్డ్కు వెళ్లాలనుకుంటున్న సమయంలోనే తీహార్ జైలుకు వెళ్లవలసి వచ్చింది. దీంతో అమెరికాకు లేదా హార్వార్డ్కు వెళ్లాలనే తన భవిష్యత్తుకు ముగిసిందని చెప్పారు. దీనికి నేను పశ్చాత్తాపపడాతానని భావించారు. కానీ అలా జరగలేదు' అని అభిజిత్ బెనర్జీ అన్నారు.
ధైర్యంగా ముందడుగేయాలి
మహాత్మాగాంధీని ఉదహరించారు అభిజిత్ బెనర్జీ. ప్రపంచాన్ని తక్షణమే మార్చాలన్న ఆకాంక్ష సరికాదని, నెమ్మదిగా ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. గాంధీ మొదటిసారి 1915లో భారతదేశానికి వచ్చినప్పుడు, తాను ఎటువైపు వెళ్తున్నాననే విషయం అతనికి కూడా తెలియదన్నారు. ఆ తర్వాత క్రమంగా సమయాన్ని బట్టి మార్పు చెందారు. అది గాంధీ గొప్పతనం అన్నారు. అలాగే, ప్రపంచాన్ని ఒక్కసారిగా మార్చాలేరని, కానీ మనం చేయవలసిందల్లా ఉత్తమంగా చేయడం అన్నారు.సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే దర్శకులు సత్యజిత్ రే, శ్యామ్ బెనగల్ అని, వారిద్దరు ఎకనామిక్స్ పట్టభద్రులని, కానీ, భిన్నమైన రంగంలోకి ప్రవేశించి రాణించారన్నారు. అలా నచ్చిన పనిచేసేందుకు ధైర్యంగా ముందడుగు వేయాలన్నారు.