వచ్చేవారం ఇన్వెస్టర్ల ముందుకు ఆసక్తికరమైన ఐపీఓలు: పూర్తి వివరాలివే
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ల జాతర ఆరంభమైంది. జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఐపీఓ కోసం దరఖాస్తులను దాఖలు చేసుకునే గడువు ముగిసిన వెంటనే మరో మూడు సంస్థలు తమ పబ్లిక్ ఇష్యూకు రానున్నాయి. వేర్వేరు సెగ్మెంట్స్కు సంబంధించిన కంపెనీలు వీటిని జారీ చేయనున్నాయి. ఈ మూడు ఐపీఓల విలువ సుమారు 5,939.03 కోట్ల రూపాయలు. ఈ మేర పెట్టుబడులను ఇన్వెస్టర్ల నుంచి ఆకర్షించడానికి ప్రణాళికలను రూపొందించుకున్నాయి.
డెలివరీ ఐపీఓ..
లాజిస్టిక్ సర్వీస్ ప్రొవైడర్ డెలివరీ ఐపీఓ ఈ నెల 11వ తేదీన ప్రారంభం కానుంది. 13వ తేదీన ముగుస్తుంది. పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా 5,235 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీని ప్రైస్ బ్యాండ్ 462 నుంచి 487 రూపాయలుగా నిర్ధారించిందా కంపెనీ యాజమాన్యం. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 30 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 30 షేర్లను ఒక లాట్గా ఖరారు చేసింది.
ఉద్యోగులకు డిస్కౌంట్..
తొలుత 7,460 కోట్ల రూపాయలను ఐపీఓ ద్వారా సేకరించాలని భావించినప్పటికీ.. దీన్ని 5,235 కోట్లకు కుదించుకుంది. కపిల్ భారతి, మోహిత్ టండన్, సూరజ్ సహ్రాన్ ఈ కంపెనీని నెలకొల్పారు. కంపెనీ ఉద్యోగుల కోసం 20 కోట్ల రూపాయల విలువ చేసే షేర్లను రిజర్వ్ చేసింది కంపెనీ. అలాగే- వారికి ఒక్కో షేర్ మీద 25 రూపాయల డిస్కౌంట్ కూడా ప్రకటించింది.
ప్రుడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్
ప్రుడెంట్ కార్పొరేట్ అడ్వైజరీ సర్వీసెస్ ఐపీఓకు రానుంది. ఈ నెల 10వ తేదీన బుకింగ్ ఓపెన్ అవుతుంది. 12వ తేదీన ముగుస్తుంది. దీని ప్రైస్ బ్యాండ్ 595 నుంచి 630 రూపాయలుగా నిర్ధారించింది. రిటైల్ వెల్త్ మేనేజ్మెంట్ సంస్థ ఇది. ఫైనాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇన్వెస్టర్లు కనీసం 23 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఐపీఓ ద్వారా 538.61 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలని నిర్ణయించింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, ఈక్విరస్ క్యాపిటల్ ఈ ఇష్యూకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్
వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ వచ్చే వారమే తన పబ్లిక్ ఇష్యూను జారీ చేయనుంది. ఈ నెల 11వ తేదీ ప్రారంభం కాబోతోంది. 13వ తేదీన ముగుస్తుంది. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ 310 నుంచి 326 రూపాయలుగా ఖరారు చేసిందా కంపెనీ మేనేజ్మెంట్. పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా 165.42 కోట్ల రూపాయలను ఇన్వెస్టర్ల నుంచి సమీకరించుకోవాలనేది వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ కంపెనీ లక్ష్యం. గుజరాత్కు చెందిన సంస్థ ఇది. కచ్ రీజియన్లోని ధనేటిలో తయారీ యూనిట్ ఉంది. ఏటా 10,800 మెట్రిక్ టన్నుల పైప్స్ అండ్ ట్యూబ్స్ను ఉత్పత్తి చేస్తుంది.