HBR: టాప్ 10లో శంతను నారాయణ్, అజయ్ బంగా, సత్య నాదెళ్ల
న్యూయార్క్: ప్రపంచంలో ఉత్తమ పనితీరు ప్రదర్శించిన సీఈవోల జాబితాలో టాప్ 10లో ముగ్గురు ప్రవాస భారతీయులకు చోటు దక్కింది. హార్వార్డ్ బిజినెస్ రివ్యూ (HBR) అనే సంస్థ ప్రతి ఏటా సీఈవోల పనితీరుపై జాబితా విడుదల చేస్తుంది. ఇందులో భాగంగా 2019 సంవత్సరానికి గాను పనితీరు ఆధారంగా టాప్ 100 సీఈవోల పేర్లను ప్రకటించింది. ఇందులో అడోబ్ కంపెనీ సీఈవో శంతను నారాయణ్, మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల టాప్ 10లో నిలిచారు. అమెరికన్ టెక్నాలజీ సంస్థ ఎన్వీడియా సీఈవో జెన్సెన్ హువాంగ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.
Samsung: పిచాయ్-సత్య నాదెళ్ల తర్వాత అగ్రస్థానానికి చేరువలో మరో ఇండియన్
జాబితాలో భారతీయులు...
HBR జాబితాలో శంతను నారాయణ్ 6వ స్థానంలో, అజయ్ బంగా 7వ స్థానంలో, సత్య నాదెళ్ల 9వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయుల్లో డీబీఎస్ బ్యాంక్ సీఈవో పియూష్ గుప్తా 89వ స్థానంలో ఉన్నారు. 2015 నుంచి కేవలం ఆర్థికపరమైన అంశాలేగాక, పర్యావరణ, సామాజిక, పాలనాపరమైన అంశాలనూ పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకుల్ని ప్రకటిస్తున్నట్లు HBR తెలిపింది.
తొలి స్థానం కోల్పోయిన జెఫ్ బెజోస్
2014 నుంచి ప్రతి సంవత్సరం అత్యుత్తమ సీఈవోల్లో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈసారి మొదటి స్థానం చేజారింది. పర్యావరణ, సామాజిక, పాలనాపరమైన అంశాల్లో బెజోస్ స్కోర్ తక్కువగా ఉందని HBR తెలిపింది. దీంతో తొలి స్థానంలో జెన్సెన్ హువాంగ్ నిలిచారు. కేవలం ఆర్థిక పని తీరు ఆధారంగా మాత్రమే జెఫ్ బెజోస్ 2014 నుంచి తొలి స్థానంలో ఉన్నారు.
టాప్ 100లో టిమ్ కుక్
టాప్ 100లో ఉన్నవారిలో నైక్ సీఈవో మార్క్ పార్కర్ (20వ స్థానం), జేపీ మోర్గాన్ చేజ్ చీఫ్ జామీ డిమాన్ (23), లాక్ హీడ్ మార్టిన్ చీఫ్ మార్లిన్ హీసన్ (37), డిస్నీ సీఈవో రాబర్ట్ ఐగర్ (55), యాపిల్ సీఈవో టిమ్ కుక్ (62), సాఫ్ట్ బ్యాంకు చీఫ్ మసయోషి సన్ (96)లు ఉన్నారు.
పని చేస్తున్న మహిళలే తక్కువగా ఉన్నారు...
ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియాలకు చెందిన సంస్థలను పరిగణలోకి తీసుకున్నట్లు HBR తెలిపింది. అలాగే పదిహేనేళ్లుగా పని చేస్తున్న సీఈవోలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపింది. మహిళా సీఈవోలు తక్కువగా ఉన్నారని పేర్కొంది. 2018లో ముగ్గురు మహిళలు ఈ జాబితాలో ఉండగా, ఈసారి నలుగురు ఉన్నారు. అంతకుముందు ఇద్దరు మాత్రమే ఉన్నారు. అసలు పని చేస్తున్న మహిళలే తక్కువగా ఉన్నారని తెలిపింది.