9,000 మంది టీసీఎస్ ఉద్యోగులు సహా లక్షలమంది PF విత్డ్రా: 'విశాఖ' ఉద్యోగులు రూ.40 కోట్లు
లాక్ డౌన్ నేపథ్యంలో ఈఫీఎఫ్ ఖాతాదారుల ఆన్లైన్ దరఖాస్తులు పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో పీఎఫ్ కార్యాలయాల్లో సేవలు ప్రారంభమయ్యాయి. చాలామంది చేతిలో డబ్బులు లేక పీఎఫ్ ఉపసంహరించుకుంటున్నారు. వీటిని క్లియర్ చేసేందుకు ఈపీఎఫ్ఓ ఉద్యోగులు పని చేస్తున్నారు. హైదరాబాద్లోని బర్కత్పుర కార్యాలయంలోని పీఎఫ్ ఆఫీస్లో వందలమంది ఉద్యోగులు రొటేషన్ పద్ధతిలో ఆన్ లైన్ దరఖాస్తులు క్లియర్ చేస్తున్నారు.
ఐటీ కంపెనీలకు భారీ షాక్, క్లయింట్స్తో సంప్రదింపులకు ఇబ్బందికరమే
వేల కోట్ల ఉపసంహరణ
లాక్ డౌన్ నేపథ్యంలో లక్షలాది మంది ఉద్యోగులు ఈపీఎఫ్ నుండి డబ్బులు ఉపసంహరించుకుంటున్నారు. ఏప్రిల్ నెలలో సగటున ఒక రోజుకు 30వేల మంది నుండి 35 వేల మంది పీఎఫ్ ఫండ్ క్లెయిమ్ చేసుకుంటున్నారు. యాజమాన్యాలు వేతనాలు చెల్లించలేని పరిస్థితులు ఉన్నాయి. దీంతో కొవిడ్ 19 కారణంగా సవరించిన నిబంధనల ప్రకారం రెండు రోజుల క్రితం వరకు రూ.2,700 కోట్లకు పైగా ఉపసంహరించుకున్నారు.
9,000 మంది ఉద్యోగులు.. రెండో స్థానంలో టీసీఎస్
కరోనా మహమ్మారి కారణంగా టెక్ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగులు కూడా పెద్ద మొత్తంలో ఈపీఎఫ్ నుండి విత్ డ్రా చేసుకున్నారట. నాలుగు రోజుల క్రితం వరకు లెక్కల ప్రకారం 9,000 మంది టీసీఎస్ ఉద్యోగులు రూ.43 కోట్లకు పైగా విత్ డ్రా చేసుకున్నారు. కంపెనీల పరంగా అత్యధిక ఉపసంహరణలు ఉన్నవాటిలో టీసీఎస్ రెండో స్థానంలో ఉంది.
7,000 మంది HCL ఉద్యోగులు
ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగుల ఉపసంహరణ ఆధారంగా టాప్ 10 కంపెనీల వివరాలు తెలిపింది. ఇందులో టెక్ దిగ్గజాలు కూడా ఉన్నాయి. HCL టెక్నాలజీస్కు చెందిన 7,000 మంది ఉద్యోగులు రూ.27 కోట్లు ఉపసంహరించుకున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు
అగ్రస్థానంలో NLC (నెయ్వెలి లిగ్నైట్ కార్పోరేషన్) ఉద్యోగులు ఉన్నారు. ఈ ఉద్యోగులు 84.4 కోట్లు విత్ డ్రా చేసుకున్నారు. ఆ తర్వాత రూ.43.3 కోట్లతో టీసీఎస్ ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు రూ.40.1 కోట్లు, ఎన్టీపీసీ ఉద్యోగులు రూ.28.7 కోట్లు, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు రూ.26.2 కోట్లు, ఆయిల్ అండ్ నేచరల్ గ్యాస్ కార్పోరేషన్ 24.2 కోట్లు విత్ డ్రా చేసుకున్నారు.
బ్లూచిప్ కంపెనీల ఉద్యోగులు కూడా
ఈపీఎఫ్ఓ, పీఎఫ్ ఉద్యోగులు అవసరమైన మేరకు డబ్బులు తీసుకుంటున్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల వారే కాకుండా బ్లూచిప్ కంపెనీల ఉద్యోగులు కూడా క్లెయిమ్ చేసుకుంటున్నారు. సంస్థలు నిర్వహిస్తున్న పీఎఫ్ ట్రస్టుల్లో రూ.500 కోట్ల వరకు ఉపసంహరించుకోవచ్చు.