ముంబై: కిరణ్ మజుందార్ షా.. పరిచయం అక్కర్లేని పేరిది. ఫార్మాసూటికల్స్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతోన్న బయోకాన్ సంస్థ ఛైర్పర్సన్. దేశీయంగా అతిపెద్ద ఫార్మాసూటికల్స్ సంస్థకు అధినేత్రిగా పేరు తెచ్చుకున్నారు. సుదీర్ఘకాలం నుంచీ ఆ సంస్థకు ఛైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. ఓ సక్సెస్ఫుల్ మహిళా పారిశ్రామికవేత్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమె చేసిన ఓ ట్వీట్ మరోసారి వివాదాలకు కేంద్రబిందువు అవుతోంది.
ఇదివరకు ఇలాంటి ట్వీట్ చేయడంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో దాన్ని ఆమె డిలేట్ చేశారు. మరోసారి అలాంటి పరిస్థితినే ఆమె ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా ముమ్మరంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోన్న పరిస్థితుల్లో.. దాన్ని లక్ష్యంగా చేసుకుని తాజాగా ఓ ట్వీట్ చేశారమె. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అరెంజ్డ్ మ్యారేజ్తో పోల్చారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం పెద్దలు కుదిర్చిన పెళ్లి తరహాలో తయారైందని చెప్పుకొచ్చారు.

వ్యాక్సిన్ ఇంజెక్షన్ వేయించుకోవడానికి తొలుత ఎవరూ ముందుకు రారని, ఆ తరువాత బాధపడతారని చెప్పారు. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద నెలకొన్న రద్దీని చూసి, తొందరపడి ఉంటే బాగుండేదని భావిస్తారని అన్నారు. అందరికంటే ముందుగా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ల పరిస్థితి మరో రకంగా ఉంటుందని కిరణ్ షా కామెంట్స్ చేశారు. తాము వేసుకున్న వ్యాక్సిన్పై అసంతృప్తితో ఉంటారని, ఇంకో టీకా వేసుకుని ఉంటే బాగుండేదనో లేక ఇంకొంచెం ఆలస్యం చేసి ఉంటే మరో మంచి వ్యాక్సిన్ దొరికి ఉండేదనో ఆశపడతారని అన్నారు. ఇదివరకు ఆమె వ్యాక్సినేషన్పై వివాదాస్పద ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఆదాయపు పన్ను కట్టే వారికి మాత్రమే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కిరణ్ మజుందార్ షా కిందటి నెల ట్వీట్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ పేయర్లకు వేసిన తరువాతే.. మిగిలిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలనే సారాంశం వచ్చేలా ఆ ట్వీట్ చేశారు. దేశంలో ఆదాయపు పన్ను కట్టేవారి సంఖ్య మూడు కోట్లు మాత్రమేనని, వారంతా కరోనా వైరస్ బారిన పడి చనిపోతే దేశం పరిస్థితేమిటని ప్రశ్నించారు. పన్నులు చెల్లించే వారే లేకపోతే.. ఈ దేశం ఎలా మనుగడ సాగిస్తుందని అన్నారు. ఆ ట్వీట్.. తీవ్ర విమర్శలకు దారి తీసింది. పలువురు నెటిజన్లు ఆమె వైఖరిని తప్పు పట్టారు. దీనితో ఆమె దాన్ని డిలేట్ చేశారు.


Click it and Unblock the Notifications